కొత్తపాకల బహిరంగ సభకు నో పర్మిషన్, నిర్వహించి తీరతామంటోన్న జనసేన...
తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో దివిస్ ల్యాబరేటరీస్ పరిశ్రమ ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ తుని నియోజకవర్గ ప్రజలు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. తుని ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. శనివారం తుని సమీపంలో కొత్తపాకల వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారని జనసేన పార్టీ వెల్లడించింది.
ఏ కారణాలతో పవన్ కల్యాణ్ సభను నిర్వహిస్తున్నది, ఎందుకు నిర్వహిస్తున్నది ఎస్పీకి జనసేన నాయకులు ముందుగానే తెలియజేశారు. పవన్ కల్యాణ్ రక్షణ కావాలని కోరితే అందుకు ఎస్పీ అనుమతి కూడా ఇచ్చారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం పవన్ కల్యాణ్ సభకు అనుమతి రద్దు చేస్తున్నామని, 144 సెక్షన్ విధిస్తున్నామని ఎస్పీ చెప్పడంపై మండిపడ్డారు.
కాలుష్యానికి కారణమయ్యే దివీస్ కంపెనీని వ్యతిరేకిస్తూ వేలాదిమంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా వారి భావాలను అర్థం చేసుకునేందుకు పవన్ కల్యాణ్ సభ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పవన్ కల్యాణ్ సభకు పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కొత్తపాకల వద్ద సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.
పోలీసులను అడ్డంపెట్టుకుని జనసేన కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అందుకు జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసులు కూడా తాము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని గుర్తుంచుకోవాలని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.