గోదావరిలో.. గాలింపు చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ బోటు మునక...! ప్రమాదం నుండి బయటపడ్డ బృందం
గోదావరిలో జరిగిన బోటు ప్రమాద మృతులను గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందానికి తృటిలో ప్రమాదం తప్పింది. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో వెళ్లిన బోటు సైతం వరద తాకిడికి గురై ప్రమాదానికి గురైంది. మృతులను గాలిస్తున్న సమయంలోనే ఎన్డీఆర్ఎఫ్ బోటు బోల్తా పడి మునిగిపోయింది. అయితే సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో ఎలాంటీ ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడ్డారు.
కాగ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గత పది రోజుల క్రితం జరిగిన బోటు ప్రమాద మృతుల కోసం గాలింపు చర్యలు జరుగుతున్న విషయం తెలిసిందే.. ప్రమాదంలో ఇంకా పదమూడు మంది ఆచూకి కోసం సహయక బృందాలు గాలిస్తున్నాయి.
సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 36 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 13 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తుండగా రోజుకో శవం బయటపడుతోంది. మరోవైపు ప్రమాద స్థలంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడతో గాలింపు చర్యలకు బ్రేక్ పడుతోంది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే సహాయక చర్యలు చేపట్టిన , నేవీతో పాటు ఇతర సహాయక బృందాలు వెనక్కి వెళ్లాయి. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి తీసుకువచ్చే ప్రయత్నాలకు రహాదారి అడ్డుగా మారింది. దీంతో రోజువారి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.