తూగో జిల్లాలో కోడిపందాలు బంద్...! నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలంటున్న ఎస్పీ..!!
కాకినాడ/ హైదరాబాద్ : సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాలు ప్రతి ఒక్కరిని రా..రమ్మని స్వాగతం పలుకుతుంటాయి. పచ్చని పంటపొలాలు, కోనసీమ కొబ్బరి తోటలు, అక్కడి ప్రజల గౌరవ మర్యాదలు, రుచికరమైన వంటకాలు, అన్నిటికి మించి మంచి కిక్కిచ్చే కోడి పందాలు ఎవరినైనా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. సంక్రాంతి సీజన్ లో ఒక్కసారైనా ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లి రావాలని ఉబలాటపడుతుంటారు.
జగన్ పాదయాత్ర: ఇచ్ఛాపురంలోని వైసీపీ పైలాన్ అద్భుతం, ఎలా ఉందంటే?
Recommended Video
అక్కడ ప్రదర్శించే కోడి పందాలు అందరిని ఎంతగానో అలరిస్తుంటాయి. అంతే కాకుండా రికార్డింగ్ డాన్స్ లు, బోగం మేళాలు కూడా జనాన్ని ఉర్రూతలూగిస్తుంటాయి. దీంతో సంక్రాంతి సెలవుల్లో ప్రతి ఒక్కరూ భీమవరం, కాకినాడ, రావులపాలెం, ఉండి, యానాం ఇలా ఏదో ఒక గ్రామంలో గడిపి వచ్చేందుకు ఉబలాటపడుతుంటారు. ఇలాంటి వారి కోసం ఈ సారి పోలీసు శాఖ చేదు వార్త వినిపిస్తోంది.
సంక్రాంతి పండుగను ఉభయ గోదావరి జిల్లాల్లో ఆస్వాదించాలనుకునే వాళ్లకు చెక్ చెప్తోంది పోలీసు శాఖ. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు, అశ్లీల నృత్యాలు, గుండాటలు, అసాంఘిక కార్యక్రమాల జరిగితే ఉక్కు పాదంతో అణిచివేయాలని తూర్పుగోదావరిజిల్లా ఎస్పీ విశాల్ గున్నీ జిల్లా పోలీస్ అధికారులకు ఆదేశించారు.
సంక్రాంతి వేడుకల సందర్భంగా ప్రజలందరూ వారి బంధువులు స్నేహితులతో ఆనందంగా జరుపుకోవాలని ఏటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా, అలాంటివి ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ హెచ్చరించారు. పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో జనవరి 7 నుంచి జనవరి 24 వరకూ 144వ సెక్షన్ విధించారు. కోడిపందాలు నిర్వహించే ప్రాంతాలపై నిఘా ఉంచామని విశాల్ పేర్కొన్నారు. దీంతో కోడిపందాల రాయుళ్లు జిల్లాల్లో ఉసూరుమంటున్నారు.