రాజమండ్రిలో శానిటైజర్ ఫైర్- బైక్ లోనే మంటలు- జనం పరుగులు...
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో జనం శానిటైజర్ల వాడకం ఎక్కువైంది. గతంలో శానిటైజర్ అంటేనే తెలియని వారంతా ఇప్పుడు శానిటైజర్లను పట్టుకుని తిరుగుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఇలా తీసుకెళ్లిన ఓ శానిటైజర్ మండిపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటు చేసుకుంది. దీంతో శానిటైజర్లను ఎండలో తీసుకెళ్లడం కూడా మంచిది కాదనే వాదన మొదలైంది.
రాజమండ్రి దేవీచౌక్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్ పార్కింగ్ లో ఓ వ్యక్తి తన బైక్ పార్క్ చేసి వెళ్లాడు. కాసేపటికే అక్కడికి తిరిగి వస్తుండగా.. బైక్ మంటల్లో చిక్కుకున్నట్లు గుర్తించాడు. కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించగా..
బైక్ కవర్ లో శానిటైజర్ ఉన్నట్లు తెలుసుకున్నాడు. మధ్యాహ్నం ఎండ వేడిమికి శానిటైజర్ వేడెక్కి కాలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్ధానికుల సాయంతో అతను మంటలు ఆర్పివేశాడు. పక్కనే ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
లేకపోతే షాపింగ్ మాల్ నుంచి వచ్చే వారికి మంటలు అంటుకుని ఉండేవని స్ధానికులు చెబుతున్నారు.