తిరుపతికి మోడీ చాలా చేశారు.. డెవలప్కు కారణం ఆయనే: సోము వీర్రాజు
తిరుపతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా చేశారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. తిరుపతి అభివృద్ధికి కారణం మోడీయేనని చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందని చెప్పారు. ఏ పార్టీ నుంచి అభ్యర్థి బరిలోకి దిగినా.. రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని ఆయన చెప్పారు. ఇదే విషయంపై ఢిల్లీలో పవన్ కల్యాణ్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.
పనిలో పనిగా చంద్రబాబు నాయుడిపై సోమువీర్రాజు విమర్శలు గుప్పించారు. ఆయన ఒక ఎన్ఆర్ఐ మాదిరిగా తయారయ్యారని విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఉంటూ.. ఏపీ రాజకీయాలపై మాట్లాడుతారని చెప్పారు. కానీ ఇక్కడి ప్రజల బాగోగులు మాత్రం పట్టవని విమర్శించారు. ఆయన తీరు మారడం లేదని.. ప్రజలు కూడా తగిన సమయంలో బుద్ది చెబుతారని తెలిపారు.
Recommended Video
ఇటు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పోటీచేయడానికి గాను తెలుగుదేశం పార్టీ తన అభ్యర్దిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పోటీచేస్తారు. గత ఎన్నికల్లో కూడా ఆమె టీడీపీ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అప్పుడు విజయం సాధించిన వైసిపి అభ్యర్ది బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పనబాక లక్ష్మి గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత పరిణామాలలో ఆమె టిడిపిలో చేరారు.