మోరంపూడి జంక్షన్ టు కోటిపల్లి బస్టాండ్: జోలెపట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు నాయుడు
రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేపట్టిన అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్ర రాజమండ్రికి చేరుకుంది. రాజమండ్రిలో చంద్రబాబు, జేఏసీ నేతలు తీసిన ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తర్వాత రాజధాని కోసం చంద్రబాబు నాయుడు జోలెపట్టి ప్రతీ ఒక్కరి నుంచి విరాళాలు సేకరించారు.
రాజధానిని మార్చొద్దని చంద్రబాబు నాయుడు ఆందోళన బాట పట్టారు. రాజమండ్రిలో జేఏసీ బృందంతో కలిసి చంద్రబాబు నాయుడు ర్యాలీ తీశారు. మోరంపూడి జంక్షన్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు చంద్రబాబు నాయుడు బృందం ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో భాగంగా చంద్రబాబు జోలెపట్టి విరాళాలు సేకరించారు. చంద్రబాబు ర్యాలీలో టీడీపీ నేత చినరాజప్ప, ఇతర నేతలు, జేఏసీ లీడర్లు తదితరుల పాల్గొన్నారు.
అంతకుముందు అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కొనసాగింది. చంద్రబాబు బస్సుయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, జేఏసీ నేతలు స్వాగతం పలికారు. రైతులు, మహిళలు.. చంద్రబాబుకు విరాళాలు అందజేశారు. అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్ర బుధవారం ప్రారంభం కావాల్సి ఉన్న.. మహిళా రైతులను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. బెంజ్ సర్కిల్ వద్ద చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సుయాత్రకు ఆర్టీవోతోపాటు పోలీసుల పర్మిషన్ కూడా కావాలనడంతో అగ్గిరాజేసింది. గురువారం నుంచి తిరిగి అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.