ఆవ భూముల రగడ .. 500కోట్ల స్కాం అన్న టీడీపీ ..ఆవగింజంత అవినీతి కూడా లేదన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి లోని ఆవ భూముల వ్యవహారంలో రగడ కొనసాగుతోంది. ఆ భూముల కొనుగోలులో 500 కోట్ల అవినీతి జరిగిందని టిడిపి విమర్శలు గుప్పిస్తుంటే, ఆవ భూముల కొనుగోలులో ఆవగింజంత అవినీతి కూడా జరగలేదని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ. ఆవ భూముల విషయంలో చంద్రబాబు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఏపీలో హాట్ టాపిక్ గా ఆవ భూముల వ్యవహారం .. సీఎస్ కు బాబు లేఖ
ఒకపక్క టిడిపి అధినేత చంద్రబాబు ఆవ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇళ్ల పట్టాల పేరుతో చేసిన భూసేకరణలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతున్నదని ఆయన తన లేఖ ద్వారా సీఎస్ దృష్టికి తీసుకు వెళ్లారు . ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేని ఆవ భూములను, చిత్తడి నేలలను , ముంపు భూములను కొనుగోలు చేస్తున్నారని ఆయన తన లేఖ ద్వారా తెలిపారు. ఇళ్ల పట్టాల భూసేకరణలో సరికొత్త అవినీతికి అంకురార్పణ జరిగిందని రాజానగరం కోరుకొండ మండలం బూరుగుపూడి భూసేకరణ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.
ఆవ భూములలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాల ఆరోపణలు .. వైసీపీ ఎంపీ కూడా
600 ఎకరాల ఆ భూములు ఇళ్ల పట్టాల కింద సేకరించారని, ఎకరం నలభై ఐదు లక్షల రూపాయల చొప్పున 270 కోట్లు ఖర్చు చేశారని , మొత్తం ఈ వ్యవహారంలో 500 కోట్ల కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.ఇదే విషయాన్ని సిఎస్ కు లేఖ ద్వారా చంద్రబాబు తెలియజేశారు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు మిగతా పార్టీల నేతలు కూడా ఆవ భూముల వ్యవహారంపై మండిపడుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు .
చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగులుతాడు : మంత్రి శ్రీనివాస వేణుగోపాల శర్మ
అయితే రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలను ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుకుంటుందని, చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు అని మండిపడ్డారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల శర్మ. హైదరాబాద్లో కాపురం ఉంటూ అవినీతి సొమ్ముతో అజీర్తి చేసి ఆవలింత వచ్చినప్పుడల్లా అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.ఆవ భూముల్లో ఐదు వందల కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారని ఖర్చు చేసిందే 170 కోట్లు అంటూ మంత్రి పేర్కొన్నారు. అలాంటి చోట 500 కోట్లకు కుంభకోణానికి ఆస్కారం ఎక్కడ ఉంది అని మంత్రి ప్రశ్నించారు.
Recommended Video
ఆవ భూముల్లో ఆవగింజంత అవినీతి కూడా లేదని క్లారిటీ
రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళల పేరిట ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి వారికి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే అడ్డుకున్న చంద్రబాబు అసత్య ప్రచారానికి తెర తీశాడు అని మండిపడ్డారు .30 లక్షల ఇల్లు నిర్మించడం కోసం ఒక మోడల్ హౌస్ ను సందర్శిస్తే కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని ప్రధానమంత్రికి బాబు లేఖ రాశారని,ఆధారాలు చూపించమని డిజిపి అడిగితే మీరెవరు అడగడానికి అని ప్రశ్నించారని ఫైర్ అయ్యారు. ఇక అలాంటి వారే సిఎస్ కు లేఖ రాయడం విడ్డూరంగా ఉంది అంటూ ఆవ భూముల్లో ఏమాత్రం అవినీతి జరగలేదని, ఆవగింజంత అవినీతి కూడా లేదని పేర్కొన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాల శర్మ.