సీఎం జగన్..ఎంపీ రఘురామ రాజు మధ్యలో పవన్ కళ్యాణ్..! ఢిల్లీలో ఏం జరిగింది...!
వైసీపీ ఎంపీ రఘురామ రాజు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన ఢిల్లీలో వ్యవహరిస్తున్న తీరు మీద ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంతో ఉన్నారు. ఆయన బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారంతోనే సీఎం సీరియస్ అయ్యారని అందరూ భావించారు. అయితే ,ఇదే సమయంలో పార్లమెంట్ సెంట్రల హాల్ లో ప్రధాని మోదీ స్వయంగా రఘురామరాజును పలకరించారు. ఎంపీ సైతం వంగి నమస్కరించారు. దీని ద్వారా..తనకు ప్రధాని వద్ద ఉన్న గుర్తింపు ఎలాంటిదో పార్టీలోని సహచర ఎంపీల ముందు అర్దమయ్యేలా రఘురామ రాజు చెప్పగలిగారు. ఇదే సమయంలో వైసీపీ మరో ఆసక్తి కర చర్చ మొదలైంది. అందులో రఘురామ రాజు కేవలం బీజేపీతో కాదు పవన్ కళ్యాణ్ తోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారనేది ఆ చర్చ సారాంశం. అదే సీఎం అసలు ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. అదే సమయంలో ఢిల్లీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల పైనా చర్చ సాగుతోంది.
రఘురామ రాజుపైన సీఎం సీరియస్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున ఏపీలో ఇంగ్లీషు మీడియం పాఠశాలల పైన టీడీపీ ఎంపీ కేశినేని లోక్ సభలో ప్రస్తావించారు. ఆ వెంటనే వైసీపీ ఎంపీ రఘురామ రాజు సైతం స్పందించారు. ఆ తరువాత ఎంపీ రఘురామ రాజు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్దం వచ్చేలా మాట్లాడారంటూ ముఖ్యమంత్రికి కొందరు ఫిర్యాదు చేసారు. దీంతో..సీఎం సీరియస్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఎంపీతో మాట్లాడాలని వైవీ సుబ్బారెడ్డిని ఆదేశించారు. అవసరమైతే పార్టీ పరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ వెంటనే సుబ్బారెడ్డితో రఘురామ రాజు మాట్లాడటం తాను ఇంగ్లీషు మీడియం పాఠశాలల పైన మాట్లాడిన అంశం పైన వివరణ ఇవ్వటంతో ఆ వివాదం ముగిసింది.
పార్టీలో కొత్త చర్చ మొదలు..
ఇదే సమయంలో వైసీపీలో కొత్త చర్చ వినిపిస్తోంది. రఘురామ రాజు బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నందుకే సీఎం సీరియస్ గా ఉన్నారని..అందుకే ఎవరైనా ప్రధాని లేదా కేంద్ర మంత్రులను కలవాలంటే సాయిరెడ్డి లేదా మిధున్ రెడ్డితో సంప్రదించి నడుచుకోవాలని సీఎం సూచించారని తొలుత చెప్పుకున్నారు. అయితే, బీజేపీతో తొలి నుండి ఉన్న సంబంధాల కారణంగానే రఘురామ రాజు బీజేపీ నేతలతో ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నా వ్యక్తిగత సంబంధాలు కొనసాగిస్తున్నారని..ఆయన వైసీపీలోనే ఉంటారని కొందరు ఎంపీలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. అయితే, ఇదే సమయంలో రఘురామ రాజు బీజేపీ తో కాదు..పవన్ ను కలిసారని...అది ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణమనే చర్చ కొత్తగా పార్టీ ముఖ్యుల వద్ద మొదలైనట్లు ప్రచారం సాగుతోంది.
పవన్ ను కలిసారంటూ..
ఎంపీ రఘురామ రాజు పవన్ ను కలిసారని..అదే ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణమని పార్టీలో ముఖ్యుల వద్ద చర్చ సాగుతోంది. అదే అంశం ఇప్పుడు పార్టీలో ప్రచారంగా మారింది. పవన్ గత వారం రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వ..బీజేపీ పెద్దలను కలుస్తారని ముందు ప్రచారం సాగింది. అయితే, ఆయన అక్కడ అమిత్ షాతో భేటీ కోసం ప్రయత్నించినా సాధ్య పడలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీలో ఎంపీ రఘురామ రాజు జనసేన అధినేత పవన్ ను కలిసారంటూ పార్టీ అధినేతకు సమాచారం అందింది. అది మొత్తంగా ఒక సినిమా వ్యవహారానికి సంబంధించిన అంశం గా చెబుతున్నారు. కారణం ఏదైనా..తమను నిత్యం విమర్శస్తూ.. ఆరోపణలు చేస్తున్న పవన్ ను కలవటం పైనే సీఎం సీరియస్ అయ్యరని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ప్రధాని పలకరింపుతో ఎంపీ సేఫ్...!
ఇక, ఇటువంటి కారణాలతో ముఖ్యమంత్రి జగన్ తన సొంత పార్టీ ఎంపీ రఘురామ రాజు పైన ఆగ్రహంతో ఉన్న సమయంలోనే ఆయనకు పరోక్షంగా రిలీప్ లభించింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రధాని రాజు గారు అంటూ పలకరించి..దగ్గరకు తీసుకోవటం..అంతా బాగుంది కదా అంటూ ప్రశ్నించటం..రఘురామ రాజు సైతం ప్రధానికి ఒంగి నమస్కరించటం ద్వారా..ఆయనకు భారీ రిలీఫ్ లభించినట్లుగా వైసీపీ లో భావిస్తున్నారు. అయితే, పార్టీలో ప్రచారం సాగుతున్నట్లుగా పవన్ తో రఘురామ రాజు సమావేశమయ్యారా..ఏం అంశం పైన కలిసారనేది రఘురామ రాజు స్పష్టత ఇస్తేనే ఈ మొత్తం ఎపిసోడ్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.