Adireddy Bhavani: దిశ పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా ఎమ్మెల్యే: వైసీపీ సోషల్ మీడియాపై..!
కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో ప్రారంభించిన మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఫిర్యాదును నమోదు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన రెండో రోజే ఆమె.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తనపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టారని, కామెంట్లను చేశారని లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Disha Police Station: దిశ పోలీస్ స్టేషన్లు ముస్తాబు: ఒకేసారి 18: వైఎస్ జగన్ చేతుల మీదుగా..!
సోషల్ మీడియా ద్వారా అసభ్యకర రాతలు..
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో దిశ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ సందర్భంగా వారంతా నల్ల బ్యాడ్జీలను ధరించి, కనిపించారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా వైసీపీ కార్యకర్తలు తనపై అసభ్యకర పదజాలాన్ని ప్రయోగించారని, అభ్యంతరకర వ్యాఖ్యానాలను పోస్ట్ చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై లిఖితపూరక ఫిర్యాదును పోలీసులకు అందజేశారు.
ఫొటోలు, క్లిప్పింగులతో ఫిర్యాదు..
సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు పోస్ట్ చేసినట్లుగా చెబుతోన్న కొన్ని ఫొటోలు, క్లిప్పింగులను ఆదిరెడ్డి భవాని తన ఫిర్యాదు పత్రానికి జత చేశారు. ఇదివరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లిక్కర్ అంశాన్ని ఆదిరెడ్డి భవాని సభలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన పాలసీ వల్ల మద్యం ధరలు మండిపోతున్నాయని ఆమె అప్పట్లో శాసనసభలో ప్రస్తావించారు. సామాన్య ప్రజలు మద్యాన్ని కొనలేని దుస్థితిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపారని భవానీ ఆరోపించారు.
వ్యాఖ్యలను వక్రీకరించి మరీ..
తన వ్యాఖ్యలను వక్రీకరించారని, మహిళా ఎమ్మెల్యేననే గౌరవం కూడా లేకుండా ఇష్టానుసారంగా సోషల్ మీడియా వేదికల ద్వారా దుష్ప్రచారం చేశారని చెప్పారు. వారిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారని, దాన్ని చేతల్లో చూపాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు. మాటలు చెప్పినంత సులభం కాదని, తాను ఫిర్యాదు చేసిన వారిపై కేసులు నమోదు చేసేంత వరకూ విశ్రమించనని చెప్పారు.