లాక్ డౌన్ వేళ.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం..
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 17)న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం నుండి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్,క్లీనర్ సజీవదహనం అయ్యారు. లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే డ్రైవర్,క్లీనర్ ఇద్దరూ మంటలకు ఆహుతయ్యారు.
స్థానికుల సమాచారంతో తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రవికుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఫైరింజన్ సాయంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. లాక్ డౌన్ కావడంతో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై అతివేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. లారీలో ఫినాయిల్ ఆల్కహాల్ బారెల్ ద్రావణాన్ని తరలిస్తున్నట్టు సమాచారం. ఆల్కహాల్ ధాటికి మంటలు మరింతగా ఎగసిపడినట్టు తెలుస్తోంది. దీంతో కొద్దిసేపు ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయినట్టు సమాచారం.మృతులు,ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా,లాక్ డౌన్ కారణంగా అత్యవసర సేవలకు సంబంధించిన గూడ్స్ వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు లేకుండా పోయాయి. కాలుష్యం కూడా చాలావరకు తగ్గిపోయింది. ఇక ఈ నెల 20 తర్వాత లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో గ్రీన్,ఆరెంజ్ జోన్లలో పరిమిత సంఖ్యలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను అనుమతించనున్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వాహనాలను కూడా అనుమతించనున్నారు. రైలు సర్వీసులు మాత్రం మే 3వ తేదీ వరకు రద్దయ్యాయి.