సీఎం పీఏనంటూ ఫోన్: బోటు ప్రమాద బాధితుడికి టోకరా: భార్య..కుమార్తెను కోల్పోయి..!
విహార యాత్రకు వచ్చి విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబాన్ని ఓ అగంతకుడు మోసం చేసాడు. ఏకంగా తాను ముఖ్యమంత్రి పీఏనంటూ ఫోన్ చేసి బురిడి కొట్టించాడు. ఆపదతో ఉన్న తమకు నిజంగానే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫోన్ వచ్చిందని భావించిన బాధితుడు తమ బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా తమకు అందే సాయం కోసం ఆ అగంతకుడు చెప్పిన విధంగా బ్యాంకు లో డబ్బు జమ చేసాడు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని తల పట్టుకున్నారు. బోటు ప్రమాదంలో భార్య..కుమార్తెను పోగొట్టుకున్న ఆ వ్యక్తి...ఇప్పుడు ఈ సమయంలో మోస పోవటం పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని పైన అధికారులు సీరియస్ గా ఫోకస్ చేసారు. వివరాలు ఆరా తీస్తున్నారు.
భార్య..కుమార్తెను కోల్పోయిన సమయంలో..
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో గోదావరి లో బోటు ప్రమాదంలో భార్య..కుమార్తెను కోల్పోయి కోలుకోలేని బాధలో ఉన్న కుటుంబాన్ని ఒక అగంతకుడు మోసం చేసాడు. బాధలో ఉండటం.. ప్రభుత్వం నుండి సాయం అందుతుందనే విషయం తెలుసుకొని వారికి ఫోన్ చేసి మోసం చేసాడు. బోటు ప్రమాదంలో విశాఖ వేపగుంట ముత్యమాంబ కాలనీకి చెందిన తల్లీకూతుళ్లు బొండా లక్ష్మి, పుష్ప బోటు ప్రమాదంలో మృతిచెందారు. వీరికి మిగిలిన బాధితులతో పాటుగా ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాతో పాటుగా భీమా సొమ్ము అందించాలని నిర్ణయించింది. అయితే, స్థానిక జీవీఎంసీ జోనల్ కమిషనర్కు శనివారం ఓ వ్యక్తి ఫోన్చేసి తాను అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నానని, బోటు ప్రమాద బాధితుల ఫోన్ నంబర్లు కావాలని కోరాడు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన క్రమంలో ఆ వ్యక్తికి జోనల్ కమిషనర్ బొండా లక్ష్మి భర్త శంకర్ ఫోన్ నంబర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి పీఏనంటూ..
ప్రమాదంలో మరణించిన బొండా లక్ష్మి భర్త శంకర్ కు ఆ తరువాత ఆ తర్వాత 79890 97075 నంబరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసాడు. తనను ముఖ్యమంత్రి జగన్ పీఏగా పరిచయం చేసుకున్నాడు. రూ.17 లక్షలు పరిహారం వస్తుందని నమ్మించారు. దీని కోసం శంకర్ బ్యాంకు ఖాతా నంబర్ తో పాటుగా ఐఎఫ్ ఎస్ సీ కోడ్ చెప్పాలని కోరా డు. ఆ డబ్బులు అందాలంటే తమ అకౌంట్లో రూ.7, 200 వేయాలని సూచించాడు. అప్పటికే ప్రభుత్వం నుండి సాయం అందిస్తారనే సమాచారంతో..నిజమని నమ్మి ..సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్టు భావించిన శంకర్.. ఖాతా వివరాలు చెప్పడమే కాకుండా వెంటనే వేపగుంట ఎస్బీఐలో అకౌంట్ నంబరు లో ఆ వ్యక్తి కోరిన విధంగా నగదు డిపాజిట్ చేశాడు. అనంతరం తనకు కాల్ వచ్చిన నంబరుకు ఫోన్ చేయగా పనిచేయలేదు. అనంతరం రెవెన్యూ అధికారులను సంప్రదించగా తమకు తెలియదని చెప్పడంతో మోసపోయినట్టు గుర్తించిన శంకర్... రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సంబంధిత అకౌంట్ కర్నూలు జిల్లా కాజుమూరుకు చెందిన కిరణ్కుమార్దిగా గుర్తించినట్టు సమాచారం. దీని పైన ప్రభుత్వం సీరియస్ అయింది. అసలే బాధలో ఉన్న వారిని మోసం చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.