తెలంగాణ విడిపోవడానికి కోనసీమ ఓ కారణం, అంబానికి భయపడను, ఈ బతుకెందుకు: పవన్ కళ్యాణ్
రాజమహేంద్రవరం: కోనసీమ రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఆయనకు చెప్పారు. అనంతరం ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. 2009లోనే అనుమతులు వచ్చినా 9ఏళ్లుగా కడుతూనే ఉన్నామని చెబుతున్నారన్నారు. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీబీఐ, పొత్తులపై చంద్రబాబుకు రఘువీరా ఊహించని షాక్, చిరంజీవిపై కొత్త ట్విస్ట్
దేశంలోని వ్యాపారస్తులు వారి ఉత్పత్తి ధర వారు నిర్ణయించుకుంటారని, ఒక్క రైతుకు మాత్రమే ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదన్నారు. ఎంతో పచ్చని ప్రదేశమని అందరూ కోనసీమ అంటే అసూయపడతారని, కానీ ఇలాంటి ప్రాంతంలో కూడా రైతులు కన్నీటితో ఉన్నారన్నారు. ప్రభుత్వం, రాజకీయ యంత్రాంగం సరైన సమయంలో స్పందించలేదని, అందుకే ఈ దుస్థితి అన్నారు.
కేసీఆర్ కోనసీమకు పంపించారు
తెరాసను పెట్టిన కొత్తలో కేసీఆర్ వారి నాయకులను కోనసీమ పంపించి ఇక్కడ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోమని చెప్పారని, ఒకప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయాలంటే తూర్పు గోదావరి జిల్లాకు కలెక్టర్గా పని చేసిన అనుభవం ఉందా అని అడిగేవారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగం మీద అనుభవం ఇక్కడి నుంచి నేర్చుకోవాలన్నారు. కొన్ని నెలల క్రితం మహారాష్ట్రలో రైతులు వారి బాధల కోసం 150కి పైగా కిలోమీటర్లు మౌనంగా ఉద్యమించారని, అలాంటి పరిస్థితి మన వద్ద రావొద్దన్నారు. కోనసీమలో పంటలు బాగా పండక, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమానికి, కోనసీమకు లింక్
కానీ బయటి వ్యక్తులు మాత్రం వాస్తవాలు తెలియక.. మీకేం, అద్భుతమైన కోనసీమ ఉందని, పంటలు బాగా పండుతాయని చెబుతాన్నారు.కోనసీమ ప్రాంతంలో కాలువలు పూడికతో నిండిపోయినా పట్టించుకునే నాథుడు లేడని పవన్ విమర్శించారు. రైతులకు మద్దతు ధర, మార్కెట్ కల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. పచ్చటి కోనసీమకు అందరి దిష్టి తగిలిందన్నారు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడానికి, తెలంగాణ ఓ రాష్ట్రంగా విడిపోవడానికి కోనసీమ పచ్చదనం కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవం వేరుగా ఉంటుందని చెప్పారు. పొలాల్లో మంచినీళ్లు వేసే పైపులు కూడా పగిలిపోయి, నేల నుంచి ఉప్పునీటి ఊట వస్తోందన్నారు. కొనసీమ నీళ్లు అంటే కొబ్బరి నీళ్లలా ఉంటాయన్న నానుడి ఉందనీ, ఇప్పుడు మాత్రం ఉప్పునీళ్లు వస్తున్నారన్నారు.
ఎక్కడకు వెళ్లినా ఒకటే ప్రశ్న
అనంతపురం నుంచి ఉద్ధానం వరకూ ఎక్కడకు పోయినా రైతుల నుంచి తనకు ఒకే ప్రశ్న ఎదురవుతోందని, సమస్యను పరిష్కరించాలని కలెక్టర్, అధికారుల వద్దకు వెళ్తే ప్రభుత్వానికి చెప్పుకో అని రైతులకు చెబుతున్నారని అన్నారు. అదే రైతులు సీఎం వద్దకు వెళితే కలెక్టర్కు చెప్పాలని, తన వద్దకు వస్తారా అని అంటున్నారని చెప్పారు. దీంతో సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. తమ సమస్యలను పరిష్కరించి న్యాయం ఎవరు చేస్తారో తెలియడం లేదని రైతులు విలపిస్తున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తిప్పించుకుంటోందన్నారు.
జనసేనను ప్రజల ముందుకు తీసుకు రావడం సాహసోపేతమైన చర్య
అన్నం పండించే రైతుకు అండగా ఉండని ప్రభుత్వం ఎందుకని పవన్ మండిపడ్డారు. ఎంతసేపు సింగపూర్ తరహా రాజధాని, సింగపూర్ తరహా ప్రభుత్వం అని చంద్రబాబు అంటారని, కానీ రైతులకు ఏ రకంగా గిట్టుబాటు ధర కల్పించాలని మాత్రం ఆలోచించడం లేదన్నారు. ఇప్పుడు ఆధునికీకరణ పేరుతో దేశమంతా విధ్వంసకరమైన ప్రగతి సాగుతోందన్నారు. జనసేన పార్టీని 2014లో ప్రజల ముందుకు తీసుకు రావడం చాలా సాహసోపేతమైన చర్య అన్నారు. కానీ ప్రజలకు సేవ చేసేందుకు, ధర్మపోరాటం కోసం పార్టీని స్థాపించానని చెప్పారు.
ఆ తెలంగాణ రైతు కన్నీరు పెట్టాడు, ఇంకా గుర్తుకు ఉంది
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సెజ్ల పేరుతో ఏటా మూడు పంటలు పండే భూమిని లాక్కొని రైతులను రోడ్డుపై పడేశారని పవన్ అన్నారు. ప్రభుత్వాలు రైతులను ఎందుకు రక్షించడం లేదన్నరు. 2006-07లో తెలంగాణలో ఓ రైతన్న పెట్టిన కన్నీరు తనకు ఇంకా గుర్తుకు ఉందని చెప్పారు. ఊర్ల కోసం రోడ్లు వేయడం చూశామని, కానీ రోడ్ల కోసం ఊర్లను తొలగించడం చూడలేదని ఆ తెలంగాణ రైతన్న సెజ్ విషయంలో కన్నీరు పెట్టాడని చేసుకున్నారు. రైతులు దేవుడికి ప్రతిరూపమన్నారు. అలాంటి వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని చెప్పారు.రైతులపై కాల్పులు, మద్దతు ధర లేకపోవడంతో ఆత్మహత్యలతో రైతుల పరిస్థితి దారుణంగా తయారయిందన్నారు.
అంబానీలకు జనసేన భయపడదు
తాను దోచుకోవడానికి రాలేదని, దాచుకోవడానికి కూడా రాలేదని, మీకు అండగా ఉండేందుకు వచ్చానని పవన్ చెప్పారు. అంబానీలు దేశాన్ని శాసించే కార్పోరేట్ అధిపతులు కావొచ్చునని, కానీ జనసేన మాత్రం వారికి భయపడదని చెప్పారు. జగన్, చంద్రబాబు.. అంబానీలకు భయపడతారన్నారు. కానీ పవన్ భయపడడని చెప్పారు. అధికార, ప్రతిపక్ష నేతలు అంబానీలకు భయపడి, ప్రధాని మోడీకి భయపడి రేపు ఇంకొకరికి భయపడితే ఈ బతుకు ఎందుకు అన్నారు. జనసేన ఇతర పార్టీల వలే అంబానీల నుంచి డబ్బులు ఆశించడం లేదని, మనం వారిని ధైర్యంగా ప్రశ్నిస్తామన్నారు. ఇదిలా ఉండగా, రేపల్లె నియోజకవర్గం పరిధిలోని నిజాంపట్నం మండలంలోని గరువుపాలెం మరియు పుర్లమెరక గ్రామాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన సిద్ధాంతాలు నచ్చిన పలువురు జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద విశ్వాసం వ్యక్తం చేశారు.