బ్రాహ్మణిని లాగి: చంద్రబాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు, రోడ్డుపై రోజా బైక్ డ్రైవింగ్
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం నిప్పులు చెరిగారు. తూర్పు గోదావరి జిల్లాలోని దివాన్ చెరువులో నిర్వహించిన 'మహిళా స్వరం' సభతో పాటు ఇతర చోట్ల మాట్లాడారు. నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు... నలభై ఏళ్ల వయస్సున్న తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను కాపీ చేస్తున్నారని విమర్శించారు.
పరీక్షలలో కాపీ కొట్టిన విద్యార్థిని డీబార్ చేస్తారని, మరి తమ పార్టీ హామీలను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ లాంటివారని ఎద్దేవా చేశారు. జగన్ అప్డేటెడ్ వర్షన్ అయితే చంద్రబాబు ఔట్ డేటెడ్ వెర్షన్ అన్నారు. గత ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, కానీ ఆ తర్వాత ఒక్క లోకేష్కు మాత్రమే ఉద్యోగం వచ్చిందన్నారు.
బ్రాహ్మణిని లాగిన రోజా
చంద్రబాబు తన కొడుక్కు మంత్రి పదవి ఇప్పించుకున్నారని రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తన కోడలు బ్రాహ్మణిని మాత్రమే పారిశ్రామికవేత్తగా మార్చారని, డ్వాక్రా మహిళలు అప్పులపాలయ్యారని చెప్పారు. చంద్రబాబు ఇప్పుడు పింఛన్ పెంచారని, కానీ దానిని రెండు నెలలు మాత్రమే ఇస్తారని చెప్పారు. కానీ అదే జగన్ను ముఖ్యమంత్రిగా చేస్తే జీవితాంతం ఇస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.
మళ్లీ సీఎం అయితే రాష్ట్రం చచ్చిపోతుంది
చంద్రబాబు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ కాబట్టి ఆయనను మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం చచ్చిపోతుందని రోజా అన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను దొంగిలిస్తున్న చంద్రబాబుకు వాటిని అమలు చేసే మనసుందా అన్నారు. నవరత్నాలులో ఏడు పథకాలు మహిళా అభ్యున్నతి కోసమే కేటాయించినట్లు తెలిపారు. ఇంతటి అసమర్థ ముఖ్యమంత్రితో ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. చంద్రబాబు స్మార్ట్గా మహిళలను మోసం చేస్తున్నారన్నారు. 98 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన చంద్రబాబు మహిళా ద్రోహి అన్నారు.
నాలుగేళ్లలో ఒక్క ఆడపిల్ల పుట్టలేదా?
చంద్రబాబుకు పసుపు కుంకుమ విలువ తెలుసా అని రోజా ప్రశ్నించారు. తన తల్లి అమ్మణ్నమ్మ ఆస్తిని ఆడపచులకు కాకుండా కొడుకు లోకేష్కు ఇచ్చుకున్నారన్నారు. ఎన్నికల్లో 600 హామిలిచ్చిన ఆయన ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం పేరిట రూ.30 వేలు అందిస్తామని చెప్పారని, నేటి వరకు ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదా అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు వైసీపీకే దక్కాలన్నారు. మహిళలు అబలలు కాదు సబలలు అని నిరూపించాలన్నారు.
బాబు చైనా ఫోన్, జగన్ ఐ ఫోన్
చంద్రబాబు నాయుడు చైనా ఫోన్ లాంటివారని, జగన్ ఐ ఫోన్ వంటి వాడని రోజా అన్నారు. 2014 ఎన్నికల్లో మహిళలను నమ్మించి వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు నాలుగన్నరేళ్లుగా ఎన్నికల హామీలన్నిటినీ విస్మరించారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ మోసం చేసేందుకు పసుపు - కుంకుమ పేరుతో రూ.10 వేలు, సెల్ఫోన్ ఇచ్చే విధంగా ప్రలోభపెడుతున్నారన్నారు. చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. జగన్ను గెలిపిస్తే ఫించను రూ.3 వేలు చేస్తారని, పేదలకు గృహనిర్మాణానికి రూ.రెండున్నర లక్షలు అందిస్తారని, వైయస్సార్ భరోసా కింద ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి రూ.లక్ష వరకు నిధులు మంజూరు చేస్తారన్నారు. కాగా, అంతకుముందు రోజా మహిళా స్వరం వేదిక వద్దకు స్కూటీ నడుపుతూ వచ్చారు. ఆమె స్కూటీ నడుపుతూ వస్తుంటే కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.