అవమానం, దుర్భర జీవితం.. ఆత్మవిశ్వాసంతో బతికేలా అవకాశమివ్వండి.. హిజ్రాల విన్నపం
రంగారెడ్డి : సమాజంలో థర్డ్ జెండర్ అంటే ఒక రకమైన చిన్నచూపు. టెక్నాలజీతో దూసుకెళుతున్న ఈ తరుణంలో కూడా వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. హిజ్రాలంటే చాలు అదో రకంగా చూస్తారు. వారికి మనసు ఉంటుందని.. ఆత్మవిశ్వాసంతో బతకాలనే తపన ఉంటుందని ఎవరూ గ్రహించరు. ప్రభుత్వాలు, పాలకులు కూడా వారిని ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు.
హిజ్రాలు అనుభవిస్తున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. థర్డ్ జెండర్గా సమాజంలో తమ పాత్ర ఏంటనే విషయం వారి మనసులను తొలచివేస్తున్నా నిస్సహాయంగా ఏమి చేయలేని పరిస్థితి. అలా అని అటు ముందుకెళ్లలేని వైనం. అయితే తాము ఎవరికి తీసిపోమని.. తమకు అవకాశం ఇస్తే నిరూపించుకుంటామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు హిజ్రాలు వినతిపత్రం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంగన్వాడీలో ప్లాస్టిక్ గుడ్లా.. పేరెంట్స్ ఫిర్యాదుతో పరేషాన్.. తీరా ఏమైందంటే..!
అవమానాలు, ఛీత్కారాలు.. జీవనోపాధి లేక భిక్షాటన
మగవారిగా తాము జన్మించినా.. అంతరాత్మ కర్మానుసారం ఆడవారిగా మారిన తమకు సమాజంలో అడుగడుగునా ఛీత్కారాలు ఎదురవుతున్నాయని హిజ్రాలు వాపోయారు. దాంతో దుర్భర జీవితం గడుపుతున్నామని.. అవమానాలు భరిస్తూ మనోవేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు హిజ్రాలు.
హిజ్రాలుగా మారినందుకు అటు కుటుంబంలోనూ ఆదరణ కరువై.. ఇటు సమాజంలో చిన్నచూపు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. తమపై వివక్షత కారణంగా జీవనోపాధి లేక భిక్షాటన చేయాల్సి వస్తోందని వాపోయారు.
సుప్రీంకోర్టు తీర్పు ఏమైంది.. సంక్షేమ పథకాల ఊసే లేదు..!
హిజ్రాల సంక్షేమం కోసం సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు హిజ్రాలు. 2014, ఏప్రిల్ 15వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం హిజ్రాలకు సంబంధించి వెలువరించిన నల్సా తీర్పు బుట్టదాఖలైందని గుర్తుచేశారు. హిజ్రాలను థర్డ్ జెండర్గా గుర్తించి స్త్రీ, పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలనేది ఆ తీర్పు సారాంశం. కానీ క్షేత్రస్థాయిలో ఆ తీర్పు అమలుకాకపోగా అవమానాలు ఎదురవుతున్నాయని వాపోయారు.
విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా ఎలాంటి ప్రయోజనాలు దక్కడం లేదంటున్నారు హిజ్రాలు. సర్వోన్నత న్యాయస్థానం ఆ తీర్పునిచ్చి ఏడేళ్లు దాటుతున్నా కూడా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోలేదన్నారు.
పొరుగు రాష్ట్రాల్లో హిజ్రాలకు పెద్దపీట.. మరి మన రాష్ట్రంలో..!
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సాలో హిజ్రాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పుకొచ్చారు హిజ్రాలు. తెలంగాణలో ఎంతో మంది హిజ్రాలు ఇంటర్, డిగ్రీ చదువుకున్నారని.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఆసరా పెన్షన్ ఇవ్వడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోరారు. అలాగే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశారు.
పోలీస్ శాఖలో కొత్త కొలువులు.. 15 వేల నియామకాల భర్తీకి కసరత్తు
కలెక్టర్ దృష్టికి పలు అంశాలు.. సాయం చేయాలని విన్నపం
సరైన విద్య, ఉద్యోగావకాశాలు లేక భిక్షాటన చేయాల్సి వస్తోందని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో కలెక్టర్ను కలిసిన తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్స్ సమితి జిల్లా సభ్యులు వినతిపత్రం సమర్పించారు. తమను దుర్భర జీవితం నుంచి బయటకు తెచ్చి ఆత్మవిశ్వాసంతో బతికేలా ప్రోత్సహించాలని కోరారు.
విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. అలాగే కుటీర పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇప్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.