తెలంగాణలో భారీ వర్షాలు... రంగంలోకి రెండు హెలిక్యాప్టర్లు... అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్...
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్,కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవడంతో చెరువులు అలుగు దుంకుతున్నాయి. కొన్నిచోట్ల వాగులు,చెరువులు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనంపల్లిలో వాగులో 12 మంది రైతులు చిక్కుకుపోయారు.ఆసిఫాబాద్ జిల్లాలోనూ వాగు ఉప్పొంగి 60 మంది వరకు రైతులు చిక్కుకుపోయినట్లు సమాచారం.
సురక్షితంగా బయటపడ్డ రైతులు...
బావిలో మోటార్లను పైకి తీసేందుకు వెళ్లిన రైతులు వాగు ఉధృతికి వరదలోనే చిక్కుకుపోయారు. ఓ చెట్టుపై ఎక్కి చాలాసేపు అలాగే కూర్చుండిపోయారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మంత్రి కేటీఆర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సీఎం కేసీఆర్ కూడా ఎర్రబెల్లితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన కేటీఆర్ అధికారులతో మాట్లాడి రెండు హెలికాప్టర్లను పంపించారు. హెలికాప్టర్ల సాయంతో ఎట్టకేలకు 12 మంది రైతులు సురక్షితంగా బయటపడ్డారు.
ఆసిఫాబాద్ జిల్లాలోనూ...
ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలంలోని బొక్కి వాగు ఉప్పొంగడంతో దాదాపు 60 మంది రైతులు చిక్కుకుపోయారు. మేరుగూడ-ఎల్లూరు మధ్య వరద నీటి ఉధృతి పెరగడంతో రైతులు చిక్కుకుపోయినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో రైతులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే చర్యలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక సిద్ధిపేట జిల్లాలో ఓ లారీ వాగు ఉధృతిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ సురక్షితంగా బయటపడగా, డ్రైవర్ గల్లంతయ్యాడు.
రికార్డు స్థాయి వర్షాపాతం...
భారీ వర్షాలతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 27 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని... దాని ప్రభావంతో తెలంగాణలో ఒకటి,రెండు చోట్ల ఆదివారం(అగస్టు 16) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Recommended Video
అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్లో 2 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్... మంత్రులు జిల్లాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉమ్మడి వరంగల్,కరీంనగర్ జిల్లాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కొన్నిచోట్ల చెరువులు నిండి గండ్లు పడే అవకాశం ఉందని... వరదల కారణంగా రాకపోకలకు అంతరాయం కలగవచ్చునని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.