వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ, ఏడాది కాలపరిమితి డిపాజిట్లపై 4.9%
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించింది. సెప్టెంబర్ 10 నుండి ఏడాది కాలపరిమితి ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లకు 5.40 శాతం వడ్డీ రేటును, ఇతరులకు 4.90 శాతానికి తగ్గించింది. రూ.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఏడాది నుండి రెండేళ్ల మెచ్యూరిటీపై వడ్డీ రేట్లు తగ్గించింది. అంతకుముందు సీనియర్ సిటిజన్లకు 5.60 శాతం, ఇతరులకు 5.10 శాతంగా ఉంది. 20 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది.
సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం 45 రోజుల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీ రేటు 2.9శాతానికి దిగి వచ్చింది. 46 రోజుల నుంచి 179 రోజుల డిపాజిట్స్ పైన 3.9 శాతానికి, 180 రోజుల నుంచి 210 రోజులు, 211 రోజుల నుండి ఏడాది లోపు డిపాజిట్స్ పైన 4.4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఏడాది నుండి రెండేళ్ల లోపు డిపాజిట్స్ పైన 4.9 శాతం, 2 ఏళ్ల నుండి 3 ఏళ్ల లోపు 5.1 శాతం, 3 ఏళ్ళ నుండి 5 ఏళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.3 శాతానికి తగ్గించింది. అయిదేళ్ల నుండి 10 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.4 శాతంగా ఉంటుంది.
ఇక సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీపై సాధారణ కస్టమర్లతో పోలిస్తే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. వీరికి 7 రోజుల నుండి 45 రోజులకు వడ్డీ రేటు 3.4 శాతం, 46 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 4.4 శాతానికి, 180 రోజుల నుండి ఏడాది కాలపరిమితిపై 4.9 శాతం, ఏడాది నుండి రెండేళ్ళ కాలపరిమితిపై 5.4 శాతం, రెండేళ్ల నుండి మూడేళ్ల లోపు కాలపరిమితిపై 5.6 శాతం, మూడేళ్ల నుండి ఐదేళ్ల కాలపరిమితిపై 5.8 శాతం, ఐదేళ్ల కాలపరిమితి నుండి పదేళ్ల కాలపరిమితిపై 6.2 శాతం వడ్డీ రేట్లు వర్తిస్తాయి. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫిబ్రవరి నుండి ఆర్బీఐ రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది.