ధోనీ భార్య బర్త్డే వేడుకల్లో స్పెషల్ గెస్ట్గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్: మెరిసిన సానియా
దుబాయ్: టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షిసింగ్.. 32వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. గురువారం ఆమె తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు. దుబాయ్లో గ్రాండ్గా ఆమె బర్త్డే పార్టీని ఏర్పాటు చేశాడు ధోనీ. గోల్డ్, సిల్వర్ కలర్ ఫ్యాన్సీ వియర్లో సాక్షిధోనీ కనువిందు చేశారు. బ్లాక్ టీ-షర్ట్, జీన్స్ ప్యాంట్లో క్యాజువల్ లుక్లో ధోనీ కనిపించాడు. ఈ ఫంక్షన్కు అనుకోని అతిథులు హాజరయ్యారు. భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ వేడుకల్లో తళుక్కున మెరిశారు.
షోయబ్తో ధోనీ దోస్తీ
మహేంద్రసింగ్ ధోనీ-షోయబ్ మాలిక్ మంచి స్నేహితులు. దేశాలు వేరైనప్పటికీ.. క్రికెటర్లుగా వారి మధ్య స్నేహ సంబంధాలు చాలాకాలం నుంచీ కొనసాగుతున్నాయి. ఓ ప్రొఫెషనల్ క్రికెటర్గా షోయబ్ మాలిక్ను ధోనీ చాలా అభిమానిస్తాడంటూ సానియా మీర్జా స్పష్టం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ధోనీ-షోయబ్ మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని, అదే వారిద్దరినీ దగ్గరికి చేర్చిందంటూ బహిరంగంగా చెప్పారామె. ఆ కారణం వల్లే తన భార్య సాక్షి సింగ్ బర్త్డే వేడుకల కోసం ధోనీ.. షోయబ్ మాలిక్ దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించాడు.
అతికొద్ది మంది అతిథులతో...
షోయబ్ మాలిక్.. ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత క్రికెట్కు గుడ్బై పలికాడు. తన స్థాయికి తగినట్టుగా అతను ఆడలేకపోయాడు. సాక్షి ధోనీ బర్త్డే సందర్భంగా పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ నటులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సురేష్ రైనా సాక్షికి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. ధోనీ ఫ్యామిలీ ఫ్రెండ్ కబీర్ బాహియా, షోయబ్ మాలిక్, సానియా మీర్జా సహా అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ ఫంక్షన్కు హాజరయ్యారు. బర్త్డే వేడుకలను దుబాయ్లో నిర్వహించడం, టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటం వల్ల వారెవరూ హాజరు కాలేదు. సోషల్ మీడియా ద్వారా సాక్షికి శుభాకాంక్షలు తెలిపారు.
ఐపీఎల్లో పేలవ ప్రదర్శన
ఎమిరేట్స్లోనే జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్లో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ పేలవంగా ఆడిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ప్లేఆఫ్ దశకు చేరుకోలేకపోయింది ధోనీ టీమ్. టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. టోర్నమెంట్ నుంచి వైదొలగిన తొలి జట్టుగా అవమానాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్-2021 సీజన్ కోసం ధోనీ సమాయాత్తమౌతున్నారు. షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటివారంలో ఐపీఎల్ టోర్నమెంట్ను నిర్వహించే అవకాశం ఉంది.