26న పెళ్లి: ఏపీ జీవీబీ ఉద్యోగిని దారుణ హత్య, తన గదిలోనే గొంతుకోసి చంపేశారు
సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్లో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన యువతిని దుండగులు ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లోనే గొంతుకోసి హతమార్చారు. కాగా, ఆమెకు ఫిబ్రవరి 26న వివాహం జరగాల్సి ఉండగా ఈ హత్య జరగడం గమనార్హం.
గజ్వేల్ పట్టణంలోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ)లో దివ్య పనిచేస్తోంది. మంగళవారం సాయంత్రం విధులు పూర్తి చేసుకుని తను అద్దెకుంటున్న ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత ఆమె ఆమె గదిలోకి దూరిన దుండుగులు ఆమె గొంతుకోసి దారుణంగా చంపేశారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దివ్య ఇంటికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వెళ్లారని స్థానికులు పోలీసులకు తెలిపారు. తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారా? లేక మరెవరైనానా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, తన కూతురును ప్రేమిస్తున్నానంటూ గత కొన్నేళ్లుగా వెంకటేష్ అనే యువకుడు వెంటపడుతున్నాడని, అతడే ఆమె చంపేశాడని దివ్య తల్లి ఆరోపించారు. అతడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల క్రితమే దివ్యకు ఉద్యోగం వచ్చిందని, వివాహం కూడా త్వరలో జరగనుండగా ఇలా జరగిందంటూ కన్నీటిపర్యంతమయ్యారు.