ఆ క్రిమినల్ కేసు కొట్టేయండి: హైకోర్టులో రఘునందన్ రావు క్వాష్ పిటిషన్
హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అనూహ్య విజయం సాధించి ఎమ్మెల్యే అయిన బీజేపీ నేత రఘునందన్ రావు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఉపఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటనపై పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ ఆయన తన క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు.
Recommended Video
కేసీఆర్ నా గురువు: తిరుమలలో రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
సిద్దిపేటలోని తన బంధువుల ఇళ్లలో రూ. 18.67 లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు కట్టు కథలు అల్లి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్ద విచారణకు వచ్చింది. అయితే, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. ఈ క్రమంలో రఘునందన్ క్వాష్ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశించారు.
హైకోర్టును ఆశ్రయించడానికి గల కారణాలు పరిశీలించినట్లయితే.. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 26న రఘునందన్ రావు మామ, అంజన్ రావు అనే మరో వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షల లభించాయని, ఆ సొమ్మును దుబ్బాక ఉపఎన్నికలో ఓటర్లకు పంచేందుకు సిద్దం చేసినట్లు తెలిసిందని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.
కాగా, పోలీసులు సోదాలు చేసే సమయంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పోలీసులకు, వారికి మధ్య తోపులాట కూడా జరిగింది. ఓ సందర్భంలో రఘునందన్ రావు సొమ్మసిల్లిపడిపోయారు. పోలీసుల వద్ద నుంచి కొంతమేర డబ్బును ఓ బీజేపీ కార్యకర్త లాక్కుని.. పోలీసులే డబ్బు తెచ్చారంటూ ఆరోపించాడు. అయితే, సీజ్ చేసిన డబ్బును బీజేపీ కార్యకర్త తీసుకెళ్లాడని సీపీ చెప్పారు. ఇక వ్యవహారంపై వీడిమో ఫుటేజీ ఆధారంగానే క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
దుబ్బాక ఉపఎన్నికలో తన గెలుపును అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ విధంగా కుట్రలు చేస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు. తమ బంధువుల ఇళ్లలో ఒక్క రూపాయి కూడా దొరకలేదని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో రఘునందన్ రావు అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రఘునందన్ రావు ఆ కేసుపై హైకోర్టును ఆశ్రయించారు.