ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు.. కడుపులో దూది పెట్టి కుట్లేశారు
నిర్లక్ష్యమో, మతిమరపో తెలీదు కానీ తెలంగాణ రాష్ట్రంలో రోజుకో చోట వైద్యుల నిర్వాకం బయటపడుతుంది. శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులో కత్తెరపెట్టి కుట్టేసిన ఘటన మరువకముందే తాజాగా సిద్దిపేట జిల్లాలో ఒక మహిళ కడుపులో దూదిపెట్టి కుట్లు వేసిన ఘటన చోటు చేసుకుంది. శస్త్రచికిత్స నిర్వహించేటప్పుడు కాస్త ఏమరుపాటుగా ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్న కనీస శ్రద్ధ కూడా లేని వైద్యుల నిర్వాకం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతోంది.
సిద్ధిపేట జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ... కడుపులో దూది పెట్టి కుట్లేసిన వైనం
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు ఆమె శరీరంలో దూది ఉండ పెట్టి కుట్లు వేశారు. కొద్దిరోజుల తర్వాత మహిళా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం బయటకు వచ్చింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన జంగిటి స్వప్న ఫిబ్రవరి 13వ తేదీన ప్రసవం కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రికి వచ్చింది.ప్రసవ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో దానిని ఆపేందుకు దూది ఉండను అమర్చారు వైద్యులు. అయితే ఆ దూది ఉండను తీయకుండానే కుట్లు వేశారు.
తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడిన మహిళ.. కడుపులో దూది ఉండ తొలగించిన వైద్యులు
కొద్దిరోజుల తర్వాత తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యులను సంప్రదించడం కడుపులో దూది ఉన్నట్టు తేల్చారు వైద్యులు. దీంతో తిరిగి బాధితురాలికి ఆపరేషన్ చేసి దూది ఉండను తొలగించారు.
కడుపులో దూది ఉండ పెట్టి కుట్లు వేసిన వైద్యులు తీరుపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట ఆసుపత్రిలో బాధితురాలు బంధువులకు, ఆసుపత్రి సిబ్బంది కి మద్య ఈ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది.
పునరావృతం అవుతున్న ఘటనలు ... చర్య తీసుకోవాలని ప్రజల డిమాండ్
వైద్యులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని స్వప్న బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు పెరగడంతో శస్త్ర చికిత్సల సమయంలో ఇలా కడుపులో కత్తెర్లు మర్చిపోవడం, దూది మర్చిపోవడం వంటి ఘటనలకు పాల్పడుతున్న వైద్యులు, శస్త్ర చికిత్స నిర్వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. వరుసగా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్న నేపథ్యంలో అయినా వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోకుంటే వైద్యులు ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నే ఉంటారు.