సోనియా గాంధీ కీలక నిర్ణయం - దుబ్బాక కాంగ్రెస్ టికెట్ శ్రీనివాసరెడ్డికే - రసవత్తరంగా ఉపఎన్నిక
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసింది. టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి పేరును దుబ్బాక అభ్యర్థిగా సోనియా గాంధీ ఖరారు చేశారు. ఈ మేరకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ బుధవారం రాత్రి అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. కాంగ్రెస్ నుంచి కూడా బలమైన అభ్యర్థికి టికెట్ ఖరారు కావడంతో ఉప పోరు మరింత రసవత్తరంగా మారింది.
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా మణికం ఠాగూర్ నియమితులైన తర్వాత జరుగుతోన్న తొలి ఎన్నికలు కావడం, 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలు తీర్మానించుకున్న నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. ఈ క్రమంలోనే.. టీపీసీపీ కోర్ కమిటీలో సభ్యుడిగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చివరి క్షణంలో చెరుకు శ్రీనివాసరెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చారు.
చెరుకు శ్రీనివాసరెడ్డి మంగళవారమే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరుసటి రోజే ఆయన అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ ఖరారు చేయడం గమనార్హం. శ్రీనివాసరెడ్డికి టికెట్ విషయంలో దామోదర్ రాజనర్సింహ వేగంగా పావులు కదిపి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణికం ఠాగూర్తో పలు దఫాల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
దుబ్బాక నియోజక వర్గంలోని బలమైన రెడ్డి సామాజిక వర్గంతో పాటు, కాంగ్రెస్ ఓటు బ్యాంకును, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను శ్రీనివాస రెడ్డి సమీకరించగలరని హస్తం గుర్తు పార్టీ ఆశిస్తున్నది. మల్లన్నసాగర్ బాధితుల పక్షాన శ్రీనివాసరెడ్డి చేసిన పోరాటం కూడా పార్టీకి కలిసొస్తుందని నేతలు భావిస్తున్నారు. తనకు కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయి స్వేచ్చను ఇవ్వడంతో పాటు 2023లో కూడా తనకే బీఫాం ఇస్తారనే హామీ ఇవ్వాలనే ప్రతిపాదను గ్రీన్ సిగ్నల్ రావడంతో శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున దివంగత సోలిపేట లింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.