దుబ్బాక బై పోల్ : కాంగ్రెస్ పార్టీకి షాక్... టీఆర్ఎస్లో చేరిన కీలక నేతలు
ఎన్నికల వేళ కండువాలు మార్చడం నేతలకు చాలా కామన్. ఏ పార్టీలో టికెట్ వచ్చే అవకాశం ఉంటే ఆ పార్టీ వైపే దూకుతారు. లేదంటే,తమకు గిట్టనివాళ్లను ఓడించేందుకైనా సరే ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోతారు. దుబ్బాక ఎన్నికల సీన్లో ఇప్పుడివే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చెరుకు శ్రీనివాసరెడ్డి టికెట్ దక్కించుకోగా... కాంగ్రెస్ టికెట్పై ఆశ పెట్టుకుని భంగపెట్టిన నర్సింహారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మరో కాంగ్రెస్ కీలక నేత మనోహర్ రావు కూడా కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరారు
సుజాతకు భారీ మెజారిటీ ఖాయమన్న హరీశ్...
శుక్రవారం(అక్టోబర్ 9) మంత్రి హరీష్ రావు సమక్షంలో నర్సింహారెడ్డి, మనోహర్రావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సుమారు 2వేల మంది అనుచరులతో భారీ ర్యాలీగా వచ్చి పార్టీలో చేరారు. ఒకటి,రెండు రోజుల్లో మరింతమంది ముఖ్య నేతలు,కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు భారీ మెజారిటీ ఖాయమన్నారు.దుబ్బాకకు తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించబోతుందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు.
ఎన్నికలు ముగిసేవరకే ఇక్కడ ఉత్తమ్...
ఎన్నికలు ముగిసేంతవరకే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాకలో కనిపిస్తాడని... కానీ తాము 24గంటలు ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటామని మంత్రి హరీశ్ అన్నారు. కేవలం ఓట్ల కోసం వచ్చేవాళ్లకు ఓట్లు వేద్దామా లేక ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకునేవాళ్లకు ఓటు వేద్దామా అని అడిగారు. నిజానికి గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లైనా వస్తాయో రావో అన్న భయం కాంగ్రెస్ను వెంటాడుతోందన్నారు. సోలిపేట సుజాత దుబ్బాకలో పోటీకి అసమర్థురాలు అని ఉత్తమ్ వ్యాఖ్యానించడం... మొత్తం నియోజకవర్గ మహిళా లోకాన్ని కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తరుపున శ్రీనివాసరెడ్డి...
కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు విషయంలో తర్జనభర్జన పడ్డ ఆ పార్టీ ఎట్టకేలకు చెరుకు శ్రీనివాస రెడ్డికే టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు తూంకుంట నర్సారెడ్డి, కోమటిరెడ్డి వెంకటనరసింహారెడ్డి పేర్లను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్లు లీకులు వచ్చాయి. అయితే శ్రీనివాస రెడ్డిని త్వరగా పార్టీలో చేర్చుకునేందుకు ఈ లీకులను కాంగ్రెస్ ఓ అస్త్రంగా ప్రయోగించిందన్న వాదన కూడా ఉంది. మొత్తానికి శ్రీనివాస రెడ్డికి టికెట్ ఖరారవడంతో నర్సారెడ్డి,కోమటిరెడ్డి నర్సింహారెడ్డిలకు భంగపాటు తప్పలేదు. దీంతో నర్సింహారెడ్డి పార్టీని వీడారు. ఇక నర్సారెడ్డి రాజకీయ కదలికలకు సంబంధించి ఇప్పటికైతే కొత్త అప్డేట్ ఏమీ లేదు.
Recommended Video
టఫ్ ఫైట్...
నవంబర్ 3న జరగనున్న దుబ్బాక ఎన్నికను టీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ తరుపున దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత,కాంగ్రెస్ తరుపున చెరుకు సుధాకర్ రెడ్డి,బీజేపీ తరుపున రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుండగా... అధికార పార్టీ దూకుడుకు చెక్ పెట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక టీఆర్ఎస్కు తామే సరైన ప్రత్యామ్నాయమని,అధికార పార్టీని ఢీకొట్టగల సత్తా తమకే ఉందని నిరూపించుకునేందుకు బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో దుబ్బాక వార్ ఉత్కంఠ భరితంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.