దుబ్బాక బైపోల్ : నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత
దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి బుధవారం(అక్టోబర్ 14) నామినేషన్ దాఖలు చేశారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం సుజాత మీడియాతో మాట్లాడారు. ఎప్పుడూ దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉండే తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర అభివృద్దిని ఓర్వలేకపోతున్నాయని,అడుగడుగునా అభివృద్దిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కాంగ్రెస్,బీజేపీలకు దుబ్బాకలో ఓటమి తప్పదన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఏ గ్రామంలో అడుగుపెట్టినా అపూర్వ స్వాగతం లభిస్తోందన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల 16వ తేదీతో దుబ్బాక ఉపఎన్నికకు నామినేషన్ల గడువు ముగియనుంది.17న నామినేషన్ల పరిశీలన, 19న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. 10న ఫలితాలను ప్రకటిస్తారు.
Recommended Video
దుబ్బాక ఉపఎన్నిక పట్ల టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్,బీజేపీ కూడా ధీమాగా ఉన్నాయి. టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ చెబుతుండగా... ఇప్పటికే అక్కడ రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావు పట్ల సానుభూతి,ఆయన సమర్థత తమకు కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. మొత్తంగా త్రిముఖ పోరుగా సాగనున్న దుబ్బాకలో అంతిమ విజయం ఎవరిదో తెలియాలంటే నవంబర్ 10 వరకు ఆగాల్సిందే.