దుబ్బాక బై పోల్: సోలిపేట సతీమణికే టీఆర్ఎస్ టికెట్..?, ప్రచారంలో రఘునందన్ దూకుడు..?
దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీజేపీ నుంచి రఘునందన్ పేరు వినిపిస్తోండగా... కాంగ్రెస్ నుంచి రాములమ్మ విజయశాంతి పేరును పరిశీలిస్తున్నారు. అయితే ఇంతవరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. కానీ బై పోల్ను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
సిట్టింగ్ సీటులో పాగా కోసం..?
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే సిట్టింగ్ స్ధానాన్ని నిలుపుకోవాలని గులాబీ దళం భావిస్తోంది. ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీశ్రావుకు అప్పగించారు. అభ్యర్థి ఎంపికపై మాత్రం పలువురి పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. సోలిపేట సతీమణి సుజాతను బరిలోకి దింపాలని హైకమాండ్ భావిస్తోంది. కానీ ఆమె పోటీకి సుముఖంగా లేరని విశ్వసనీయంగా తెలిసింది. తన బదులు కుమారుడు సతీశ్ రెడ్డికి ఇవ్వాలని సుజాత కోరుతున్నారు. దీంతో టికెట్ ఎవరికీ ఇవ్వాలనే సందిగ్దంలో హైకమాండ్ పడింది.
తెరపైకి చెరకు శ్రీనివాస్ రెడ్డి పేరు
సుజాత-సతీష్ రెడ్డి కాదు.. మరొకరు కూడా రేసులో ఉన్నారు. మాజీమంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరకు శ్రీనివాస్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హై కమాండ్ మాత్రం సుజాత వైపు మొగ్గు చూపుతోంది. ఆమె కుమారుడి కన్నా.. సుజాతను బరిలోకి దిపాలని భావిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
Recommended Video
ప్రచారంలో దూసుకెళ్తున్న రఘునందన్ రావు
ఇటు బీజేపీ నుంచి రఘునందన్ రావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి ముందుగానే ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఆయన పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా అభ్యర్థుల కోసం వేట జరుగుతోంది. కానీ రాములమ్మ విజయశాంతికి టికెట్ పక్కా అని ఇంటర్నల్గా చర్చ జరుగుతోంది. మొత్తానికి దుబ్బాలో సుజాత-రఘునందన్ రావు-విజయశాంతి మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.