దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్య: పాడె మోసిన హరీశ్ రావు, ఎంపీ కొత్త
సిద్దిపేట: హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమితో తీవ్రమనస్తాపానికి గురైన ఆ పార్టీ కార్యకర్త కొత్తింటి స్వామి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
Recommended Video
విషయం తెలిసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీశ్ రావు ఆ గ్రామానికి చేరుకుని కొత్తింటి స్వామి మృతదేహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత అంతిమయాత్రలో మంత్రి హరీశ్ రావుతోపాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాడె మోశారు.
ఈ సందర్భంగా హరీవు రావు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కార్యకర్తలు ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త స్వామి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరపున రూ. 2 లక్షలు అందించామని చెప్పారు.
రానున్న రోజుల్లో కూడా స్వామి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు. స్వామి పిల్లలను మంచి కాలేజీల్లో చదివిస్తామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
కాగా, స్వామి మొదట్నుంచి టీఆర్ఎస్ అభిమానిగా.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు వీరాభిమానిగా ఉన్నారని స్థానిక పార్టీ నేతలు చెబుతున్నారు. దుబ్బాకలో ఫలితం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రావడంతోనే స్వామి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని అంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.