గల్లీకో వినాయకుడు వద్దు.!గ్రామానికో విఘ్నేషుడు ముద్దు..! తెలంగాణ ప్రజలకు హరీష్ రావు వినూత్న పిలుపు..
సిద్దిపేట/హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం నిర్వహించుకోవడం పై మాజీ మంత్రి హరీష్ రావు వినూత్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆలోచించడమే కాకుండా తన సొంత నియోజక వర్గమైన సిద్దిపేటలో ఆచరణలో పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ప్రతి గల్లీలో వినాయకున్ని ప్రతిష్టించేబదులు ఒకే చోట వినాయకున్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని పిలుపునిస్తున్నారు హరీష్ రావు. వాస్తవానికి ఇది చాలా ఉత్తమమైన ఆలోచనగా చర్చ జరుగుతోంది. గల్లీకో వినాయకుడిని ఏర్పాటు చేస్తే ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, ఇలాంటి సమస్యలను అదిగమించాలంటే వినాయక మంటపాలను మితంగా ఏర్పాటు చేయాలని పిలుపునిస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఈ పద్దతిని సిద్దిపేటలో అమలు చేయబోతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
వినాయకుడి మహోత్సవం..! భక్తి భావం చాటుకునేందుకు ఒక్క మండపం చాలంటున్న హారీష్ రావు..!!
'ఏక వినాయక మహోత్సవం' అంటే, ఒకే ఒక్క వినాయకుడిని పూజించడం అని అర్థం. 'వినాయకుడు ఒక్కడే కదా, పదిమంది వినాయకుల్లేరు' అని పునరాలోచనలతో బుర్ర పాడుచేసుకోకండి. వినాయకుడు ఒక్కడే, అందుకే, ఒక్క వినాయకుడి విగ్రహాన్నే పెడదాం. ఆ ఒక్కడినే పూజిద్దాం... ఊరేగిద్దాం. ఈ ఆలోచన ఎలా ఉంది...? బాగానే ఉంది. కానీ, ఏ ఒక్కరికో ఇద్దరికో ఈ ఆలోచన ఉండగానే సరిపోదు. మన నేతలకు, మన ప్రభుత్వ పెద్దలకు, మన సమాజంలోని ప్రముఖులకు, అందరిలోనూ ఈ ఆలోచన రావాలి. అది ఆచరణగా మారాలి. ఇది సాధ్యమేనా..? సాధ్యమవుతుంది. ఆ ఒక్క జననేత మదిలోని ఆలోచన వల్ల ఆచరణలోకి వస్తోంది. ఆ నేత ఎవరో, ఆ ఆచరణ ఎక్కడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
ప్రతి గల్లీకో వినాయకుండంటే ఇబ్బందే..! ఆలోచించాలంటున్న మాజీ మంత్రి..!!
ప్రకృతితో పరిహాసమాడితే నష్టం తప్ప లాభం ఉండదు. ప్రకృతిని ప్రేమించి కాపాడితే మనకూ మనుగడ సాధ్యమౌతుంది. రాజకీయాల్లో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించే టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిష్ రావు మరో బృహత్కర కార్యాన్ని చేపట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్నారు. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట ఇప్పుడు ప్రతీ విషయంలో కొత్తగా ఆవిష్కరిస్తూ తెలంగాణకే మార్గ నిర్ధేశం చేస్తోంది. హరీష్ రావు వినూత్న ఆలోచనలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా హరీష్ రావు ఒక పిలుపునిచ్చారు. ఈసారి వినాయక నవరాత్రి ఉత్సవాలకు గ్రామం మొత్తానికి ఒకటే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అదీ మట్టివినాయకుడినే పెట్టాలని గ్రామ ప్రజలకు హరీష్ రావు పిలుపునిస్తున్నారు. దీని పేరు 'ఏక వినాయక మహోత్సవం' గా నామకరణం చేశారు.
మట్టి విగ్రహం ప్రతిష్టించండి..! పర్యావరణాన్ని కాపాడాలంటున్న ట్రబుల్ షూటర్..!!
వినాయకుడి పండుగ వస్తే చాలు పల్లెలు పట్నాల్లో గల్లీకి ఒకటి చొప్పున ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వందల సంఖ్యల వినాయకులు కొలువుదీరుతాయి. కులాలు సంఘాలు కాలనీల వారీగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో ప్రమాదకర రసాయనాలు కలిపిన రంగులు వాడడం వల్ల నిమజ్జనం తర్వాత చెరువులు కలుషితమై చేపలు చనిపోయి, ఆ సాగునీటితో పంటలు ఎండిపోయి దిగుబడి తగ్గుతోంది. పైగా వినాయక ఉత్సవాల మైక్ లతో ఊరు వాడ శబ్ధ కాలుష్యం, ఇక కొన్నిచోట్ల యువకుల మధ్య ఆధిపత్య పోరుతో ఘర్షణలు, ఇలా అన్నింటిని బేరీజు వేసుకొని హరీష్ రావు ఇలా ఊరుకొక్కటి వినాయక విగ్రహం పెట్టాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వినూత్నంగా ఆలోచించిన హరీష్ రావు..! సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా అమలు..!!
అంతే కాకుండా మట్టివినాయకుడే పెట్టాలని పిలుపునిచ్చారు. హరీష్ పిలుపునకు మంచి స్పందన వచ్చింది. మొట్టమొదటగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఒకటే వినాయకుడి మట్టి విగ్రహం ఊరంతటికి పెట్టాలని తీర్మానించింది. అన్ని గ్రామాలు ఇదే బాటలో నడుస్తున్నాయట. సో హరీష్ రావు లక్ష్యం నెరవేరే సూచనలే కనిపిస్తున్నాయి. ఇది తెలంగాణ వ్యాప్తంగా కొనసాగితే మాత్రం ప్రకృతిని మనమంతా కాపాడినవారమవుతాం. మన నేతలందరూ హరీశ్ రావును ఆదర్శంగా తీసుకుంటే, మార్పు తథ్యం అనే చర్చ జరుగుతోంది.