దటీజ్ హరీశ్ రావు.. మాటిచ్చారు.. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు..!
సిద్దిపేట : మాటిస్తే మడమ తిప్పని నేతగా మాజీ మంత్రి, ప్రస్తుత సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు పేరుంది. రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా సిద్దిపేటను తీర్చిదిద్దుతూ ది గ్రేట్ లీడర్గా దూసుకెళుతున్నారు. వైద్య, విద్యతో పాటు అన్ని రంగాల్లో సిద్దిపేటను పరుగులు పెట్టిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. అదే క్రమంలో ఆయన "గల్లీకో వినాయకుడు వద్దు.. గ్రామానికో విఘ్నేశుడు ముద్దు" అని పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అయితే ఒకే వినాయకుడ్ని పెడితే తన తరపున సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో మాట నిలబెట్టుకున్నారు హరీశ్ రావు.
సిద్దిపేటను అభివృద్ది పథంలో నడిపిస్తూ..!
మాజీ మంత్రి, సిద్దిపేట ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన నేపథ్యం, మాట తీరు అంతా కూడా సుపరిచితమే. సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తూ రాష్ట్రంలో నెంబర్ వన్ సెగ్మెంట్గా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. అలా అన్నీ రంగాల్లోనూ తన సెగ్మెంట్ను ముందు వరుసలో నిలిపేలా శాయశక్తులా కృషి చేస్తున్నారు.
హరీశ్ రావు మాటంటే సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని చెప్పొచ్చు. ప్రజలతో మమేకమవుతూ తనదైన శైలిలో ఓ ప్రజా ప్రతినిధిగా ఆయన దూసుకెళుతున్న ఎందరికో ఆదర్శమంటే అతిశయోక్తి కాదేమో. ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తూ సిద్దిపేటను పరుగులు పెట్టిస్తున్నారు హరీశ్ రావు.
లక్షల వీడియోలు తొలగిస్తున్న యూట్యూబ్.. అలాంటి వాటికి ఇక బ్రేక్..!
"గల్లీకో వినాయకుడు వద్దు.. గ్రామానికో విఘ్నేశుడు ముద్దు"
ఈసారి వినాయక చవితికి సరికొత్త నినాదంతో ముందుకొచ్చారు హరీశ్ రావు. "గల్లీకో వినాయకుడు వద్దు.. గ్రామానికో విఘ్నేశుడు ముద్దు" అంటూ పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఆయా వర్గాల మధ్య యూనిటీ ఉండేలా ఊరంతా కలిసి ఒకే మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలన్న హరీశ్ రావు పిలుపు మేరకు మిట్టపల్లి ప్రజలు ముందుకొచ్చారు. ఆ క్రమంలో ఊరంతా కలిసి ఏకదంతున్ని ప్రతిష్టించారు. అయితే హరీశ్ రావు ఇచ్చిన మాట మేరకు తొలి రోజు పూజలో పాల్గొన్నారు. అంతేకాదు గ్రామ యువతకు వాలీబాల్ కిట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఒకే ఒక్క వినాయకుడిని ఊరి ప్రజలు ప్రతిష్టించడంతో హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. త్రిదండి దేవనాథ జీయర్ స్వామితో కలిసి తొలి రోజు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధిపేట సెగ్మెంట్లో ఏది చేసినా ఒక ప్రత్యేకత ఉంటుందన్నారు హరీశ్ రావు. తన మాటను గౌరవించి దాదాపు 40 గ్రామాల్లో ఒకే వినాయకుడిని ప్రతిష్టించేలా తీర్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు.
మిట్టపల్లి ఆదర్శప్రాయం.. ఇకపై కూడా అదే విధంగా..!
గ్రామానికి ఒకే వినాయకుడు అనే నినాదం సిద్దిపేటలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా బాగానే పాకిందని చెప్పుకొచ్చారు హరీశ్ రావు. ఆ క్రమంలో మిట్టపల్లి గ్రామం ఇతర ఊళ్లకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అనంతరం గ్రామంలోని పురాతన చెన్నకేశవ ఆలయ పునరుద్ధరణ పనులను దేవనాథ జీయర్ స్వామి వారితో కలిసి పర్యవేక్షించారు. ఈ ఆలయ పునర్ నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేశామని, పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.