మంత్రి హరీష్ ఇలాకాలో అమానుషం .. మహిళను స్తంభానికి కట్టేసి, రాళ్ళు , చెప్పులతో కొట్టి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లోనూ ఇంకా అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నాగరికత ముసుగులో అనాగరికత రాజ్యమేలుతుంది . ఏవైనా భూ తగాదాలు ఉంటె చట్టపరంగా చూసుకోవాల్సింది పోయి దాడులకు పాల్పడుతున్న ఘటనలు మనుషుల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి. ఇక అలాంటి ఘటనే తెలంగాణా రాష్ట్రంలో జరిగింది.
పొలానికి సంబంధించి దారి వివాదం.. మహిళపై అమానుషం
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోతిరెడ్డిపల్లిలో తండాలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. సాక్షాత్తు మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే పోతిరెడ్డిపల్లి తండాలో ఒక పొలానికి సంబంధించి దారి వివాదంలో జ్యోతి అనే మహిళను స్థంబానికి కట్టేసి చెప్పులతో కొట్టి చాలా అమానుషంగా ప్రవర్తించారు అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు.
వ్యవసాయ బావులకు వెళ్లే దారి విషయంలో తరచూ ఘర్షణలు
లక్ష్మీపురం గ్రామానికి చెందిన హంస, స్వరూప, రమ అనే ముగ్గురు మహిళలకు పోతిరెడ్డిపల్లి తండాలో వ్యవసాయ భూములు ఉన్నాయి. అయితే అందులోకి వెళ్లే దారి విషయంలో జ్యోతితో వారికి గొడవ జరిగింది. వ్యవసాయ బావులకు వెళ్లే దారి విషయమై తరచూ గొడవలకు దిగే వీరు ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని సదరు మహిళలు వారి, వారి భర్తలకు జ్యోతిపై ఫిర్యాదు చేశారు. ఎలాగైనా ఆమెకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే వారు అమానుషానికి దిగారు.
జ్యోతి అనే మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన దారుణ ఘటన
గురువారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న జ్యోతిని గమనించారు. అనంతరం కృష్ణ అనే వ్యక్తి సాయంతో జ్యోతిని బలవంతంగా ట్రాక్టర్లో ఎక్కించుకొని లక్ష్మీపూర్కు తీసుకెళ్ళి రెచ్చిపోయిన ముగ్గురు మహిళల భర్తలు జ్యోతిని గ్రామములోని నడి బజారులో స్థంభానికి కట్టేసి కొట్టారు. చెప్పులతో, రాళ్ళతో ఆమెపై దాడి చేశారు. నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా అమానుషంగా ప్రవర్తించారు.
జ్యోతిని విడిపించిన పోలీసులు .. కేసు నమోదు
బాధితురాలి కుంటుంబ సభ్యులు 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు జ్యోతిని విడిపించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం బాధితురాలి భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు హంస, కృష్ణ, కైలు, రమ, స్వరూప, శంకర్ లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.