ఎమ్మెల్యే క్రాంతిపై దాడి హేయనీయం, ఖండించిన మంత్రి హరీశ్ రావు,
మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉప ఎన్నిక జరుగుతుందనగా సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పట్టణంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. దాడి చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. తనపై దాడి చేయగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ నేతలు దాడిలో టీఆర్ఎస్ కార్యకర్త గాయపడ్డారని పేర్కొన్నారు.
దళిత ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్యగా మంత్రి హరీష్రావు అభివర్ణించారు. పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. దుబ్బాక బీజేపీ ఎన్నికల ఇన్చార్జి జితేందర్రెడ్డి జిల్లాలో ఉంటే తప్పు కాదా? అని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సిద్దిపేటలో ఉంటే తప్పేంటని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. శాంతిభద్రతలు దెబ్బతీయాలనీ బీజేపీ నాయకులు చూస్తున్నారని విమర్శించారు.
బీజేపీ కార్యకర్తల దాడికి ముందే పోలీసులు వచ్చి తనిఖీ చేసుకొని వెళ్లారని చెప్పారు. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి ప్రచార సామగ్రి లభించలేదని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కొలేక బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని మంత్రి ఆరోపించారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్లో బస చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ రూమ్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులపై దాడికి ప్రయత్నించారు. నిలువరించిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు.
Recommended Video
దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న బీజేపీ నాయకులు దళిత బిడ్డలైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై హేయమైన చర్య అని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. దాడి చేసిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరారు.