హరీశ్రావుకు కోపమొచ్చింది.. ఆ అధికారికి చివాట్లు.. ఇంతకు ఏం జరిగిందంటే..!
సిద్దిపేట : సదా పెదాలపై చెరగని చిరునవ్వుతో కనిపించే మంత్రి హరీశ్ రావుకు ఒక్కసారిగా కోపమొచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనలో కనిపించిన కోపం మరోసారి బయట పడింది. ఎవరినైనా సరే నవ్వుతూ పలకరించే హరీశ్ రావు సాధారణంగా ఆగ్రహానికి గురి కాబోరనే పేరుంది. అయితే ఓ అధికారి తీరుతో ఆయనలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. తాజాగా జరిగిన ఘటన జిల్లాలో చర్చానీయాంశంగా మారింది.
సిద్దిపేటను అభివృద్ధిలో పరుగులు పెట్టించడమే గాకుండా.. స్థానికులకు అందుబాటులో ఉంటూ ఏ పనైనా ఇట్టే చేసి పెడతారనే పేరుంది. అడపా దడపా అధికారులతో సమావేశం అవుతూ సిద్ధిపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన సెగ్మెంట్గా తీర్చిదిద్దుతున్నారు. ఆ క్రమంలో తన దగ్గరకు వచ్చే వారికి పనులు చేసి పెడుతూ జనాలకు మరింత దగ్గరవుతున్నారు.
తెలంగాణను ఏం చేస్తున్నారు కేసీఆర్.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్నలు..!
ఆ క్రమంలో పని నిమిత్తం ఓ రైతు హరీశ్ రావు దగ్గరకు వచ్చారు. దాంతో ఆయన సంగారెడ్డి ఆర్డీవో శ్రీనుకు ఫోన్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు పది సార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. అసలు ఫోన్ తీసి మాట్లాడలేదు. అయితే వెంటనే హరీశ్ రావు జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. సదరు ఆర్డీవో తో తనకు ఫోన్ చేయించాలని జాయింట్ కలెక్టర్కు సూచించారు హరీశ్ రావు. చాలాసేపవుతున్నా ఆర్డీవో శ్రీను నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. అదలావుంటే సదరు ఆర్డీవో కలెక్టర్ కార్యాలయంలో ఉన్నారని తెలుసుకున్న హరీశ్ రావు నేరుగా అక్కడకు చేరుకున్నారు. ఫోన్ కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారివై ఉండి ఇలాగేనా చేసేదంటూ మందలించినట్లు సమాచారం.