సిద్ధిపేట వాసులకు హరీశ్ రావు లేఖలు.. ఎవరికి?.. ఎందుకు?
సిద్ధిపేట : తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక. మామకు వెన్నంటి ఉన్న అల్లుడు. సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ సాధనలో చురుకైన పాత్ర పోషించిన ధీరోదాత్తుడు. ఇలా ఎలా చూసినా హరీశ్ రావు ప్రత్యేకత వేరు. తొలి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా తనదైన పాత్ర పోషించిన హరీశ్ రావు.. తెలంగాణ రాష్ట్రాభివృద్దిలో కీ రోల్ పోషించారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను సమర్థవంతంగా అమలుచేసిన ఘనత ఆయన సొంతం.
అలాంటి హరీశ్ రావుకు ఈసారి కేబినెట్ లో చోటు దక్కకపోవడం సర్వత్రా చర్చానీయాంశమైంది. మొన్నటికి మొన్న జరిగిన మంత్రుల ప్రమాణస్వీకారంలోనూ మధ్యలో అక్కడెక్కడో కూర్చున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ ముందు వరుసలో కనిపించలేదు హరీశ్ రావు. మరి ఆయన ఇప్పుడేం చేస్తున్నారు. ఏం చేయబోతున్నారు. సిద్ధిపేట వాసులకు ఏమని లేఖలు రాస్తున్నారు. ఇలా ఎన్నో విషయాలు ఆయన కదలికలపై ఆసక్తి రేపుతున్నాయి.
25వేల నజరానా..!
సిద్ధిపేట జిల్లావాసులకు లేఖలు రాస్తున్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలవలేక ఈ పద్దతి ఎంచుకున్నారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో సిద్ధిపేట జిల్లా.. వందకు వంద శాతం ఫలితాలు సాధించాలని ఆకాంక్షించిన హరీశ్ రావు ఆ మేరకు ఆయన నియోజకవర్గ పరిధిలో లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 10/10 జీపీఏ సాధిస్తే పర్సనల్ గా 25వేల రూపాయల చొప్పున నజరానా ఇస్తామని ప్రకటించారు.
టీవిలొద్దు.. చదువే ముద్దు
విద్యార్థుల తల్లిదండ్రులకు రాసిన లేఖల్లో పలు అంశాలు ప్రస్తావించారు హరీశ్ రావు. విద్యార్థులు చదువుపై మనసు లగ్నం చేయాలంటే.. మొదట ఇంటివాతావరణం సహకరించాలన్నారు. పిల్లలను ఇబ్బందులు పెట్టకుండా, వారి ఎదుట ఇంటి సమస్యలు మాట్లాడకుండా ఉంటే మేలని సూచించారు. టీవీలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని.. పరీక్షలు అయ్యేంతవరకు టీవీలు ఆఫ్ చేయడం బెటరని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు కీలకమైన ఈ నెల రోజులు.. వారికి చదువే తప్ప ఇతర ధ్యాస లేకుండా చూడాలని కోరారు.
సిద్ధిపేట జిల్లా అన్ని రంగాల్లో రాణిస్తోందని.. విద్యారంగంలోనూ ముందువరుసలో నిలబడాలంటే పదో తరగతి ఫలితాలు కీలకంగా మారుతాయని అన్నారు హరీశ్ రావు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో రాశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివాహాలు శుభకార్యాలు ఎక్కువగా ఉండే నేపథ్యంలో స్కూలుకు గైర్హాజరు లేకుండా చూడాలన్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులను పరీక్షలకు మానసికంగా సిద్ధం చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు.
స్పెషల్ క్లాసులకు పంపండి.. ఫలితాలు సాధిద్దాం
పదో తరగతి విద్యార్థులకు అవసరమైన అన్నీ మౌలిక వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు హరీశ్ రావు. ఇప్పటివరకు చదివిన పాఠ్యాంశాలను పున:శ్చరణ చేసుకోవాలని, పాఠశాల సమయాలకు అదనంగా ఉదయం పూట ఒక గంట, సాయంత్రం పూట మరో గంట స్పెషల్ క్లాసులకు పంపాలని కోరారు. సాయంత్రం విద్యార్థులకు అల్పాహారం అందించడానికి ప్రత్యేక నిధులు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. మంచి ఫలితాలు రావాలంటే అందరం సమష్టిగా కృషి చేద్దామన్నారు. రాష్ట్రంలోనే సిద్ధిపేట తొలిస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
గతంలో పదో తరగతి ఫలితాల్లో 13వ స్థానంలో ఉన్న జిల్లాను క్రమక్రమంగా మూడో స్థానానికి తీసుకురాగలిగారు. అయితే ఈసారి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్న లక్ష్యానికి అనుగుణంగా హరీశ్ రావు ఆదేశాలతో జిల్లా విద్యాధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే పలుసార్లు సమీక్షలు కూడా నిర్వహించారు.