కసాయిలా మారిన కన్నతల్లి.. నోట్లో గుడ్డలు కుక్కి.. బీర్ బాటిల్తో పొడిచి...
సిద్ధిపేట : కన్న తల్లి ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. నవమాసాలు మోసి కని పెంచే తల్లి... బిడ్డకు చిన్న గాయమైనా తట్టుకోలేదు. అయితే కుటుంబ కలహాలు, మద్యం వ్యసనానికి బానిసైన ఓ తల్లి పేగు బంధాన్ని తెంచుకుంది. కసాయిలా మారి కన్నబిడ్డల్ని కసితీరా పొడిచి చంపింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. అందరినీ కంటనీరు పెట్టించిన ఈ ఘటన సిద్ధిపేటలో జరిగింది.
ఛాటింగ్కు రూ.400, న్యూడ్ వీడియో కాల్కు రూ.1500... యువతిని వేధించి కటకటాలపాలైన ప్రబుద్ధుడు..
ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం
జగిత్యాల జిల్లా కతలాపూర్కు చెందిన సరోజ, సిద్ధిపేట జిల్లా బస్వాపూర్కు చెందిన భాస్కర్ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల అయాన్, మూడేళ్ల హర్షవర్థన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. గతంలో ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మికుడిగా పనిచేసిన భాస్కర్ కొంతకాలంగా కారు డ్రైవర్గా చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం కరీంనగర్ నుంచి సిద్ధిపేటకు మకాం మార్చి గణేశ్ నగర్లో అద్దెకుంటున్నారు. పెళ్లైన కొన్నాళ్ల వరకు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నా ఆ తర్వాత వారి మధ్య తరుచూ గొడవలు జరిగేవి.
భార్యభర్తల మధ్య గొడవలు
భాస్కర్కు సరోజతో పెళ్లి కాక ముందే మరో మహిళతో వివాహమైంది. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు. దీనిపై మొదటి భార్య కోర్టుకెక్కడంతో న్యాయస్థానం ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అది పూర్తి చేసుకుని బయటకు వచ్చాక భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణ జరుగుతుండేది. ఐదు రోజుల క్రితం ఇలాగే గొడవ జరగగా.. సరోజ 100కు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు.
బీర్ బాటిల్తో పొడిచి చంపిన తల్లి
శనివారం ఉదయం భాస్కర్ కారు తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. గొడవల నేపథ్యంలో బిడ్డల్ని కడతేర్చేందుకు సరోజ పక్కా ప్లాన్ వేసింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంటి తలుపు మూసి టీవీ సౌండ్ పెంచింది. ఇద్దరు పిల్లల నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసా పగలగొట్టి వారిని కసితీరా పొడిచింది. తల్లి కర్కశత్వానికి విలవిల్లాడిన చిన్నారులు కాసేపటికి ప్రాణాలు కోల్పోయారు. బీర్ బాటిల్తో పొడవడంతో వారి పేగులు బయటకు వచ్చాయి. ఆ తర్వాత హాల్లోని మంచంపై పిల్లల మృతదేహాలను పడుకోబెట్టి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. సమాచారం అందుకున్న సిద్ధిపేట పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.
గుండెలవిసేలా రోదించిన తండ్రి
పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించానని, అయితే భయపడి నిర్ణయం మార్చుకున్నానని నిందితురాలు విచారణలో చెప్పింది. సరోజ వాలకం చూస్తే ఆమె పథకం ప్రకారం పిల్లల్ని చంపిందని, సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఆమెలో ఏ మాత్రం లేదని అర్థమవుతోందని పోలీసులు అంటున్నారు. మద్యం మత్తులో ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే కన్నబిడ్డల శవాలను చూసి తండ్రి భాస్కర్ గుండెలవిసేలా రోదించాడు. అతన్ని ఆపడం ఎవరితరం కాలేదు. ఇద్దరు చిన్నారుల హత్యకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.