ప్రారంభమైన పోలింగ్..ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్, జగదీశ్వర్ రెడ్డి
Recommended Video
తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు ఎన్నికల అధికారి రజత్ కుమార్. ఈ ఎన్నికల్లో కొత్తగా 20 లక్షల మంది ఓటు వేయనున్నారని ఆయన చెప్పారు. 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయొచ్చన్నారు రజత్ కుమార్. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో నిల్చుంటే ఓటువేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు వీవీప్యాట్లను అధికారులు తెరిచారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు.
ఉదయం 7 గంటలకే పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్ధిపేట అభ్యర్థి హరీష్ రావు తన కుటుంబసభ్యులతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనదన్నారు హరీష్ రావు. ప్రతిఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఓటు హక్కును కలిగిన ప్రతిఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరచాలని చెప్పారు. పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగ్లో తక్కువగా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 11 గంటలకు కుటుంబ సభ్యులతో వచ్చి తన స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పారు. ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన హరీష్ రావు మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో తాజా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో వచ్చి సూర్యాపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పడంతోనే ఆ పార్టీకి తెలంగాణపై ప్రేమ లేదని విమర్శించారు. కేసీఆర్ను ముఖ్యమంత్రి మళ్లీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.