సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం... సర్పంచ్ సహా ముగ్గురు మృతి....
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ప్రజ్ఞాపూర్ వద్ద గురువారం(సెప్టెంబర్ 3) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న ఓ లారీని కరీంనగర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.
మృతులను మంచిర్యాల జిల్లాకు చెందిన తాండూర్ సర్పంచ్,టీఆర్ఎస్ నేత కొండు అంజిబాబు, జాగృతి నాయకులు యిడిదినేని గణేశ్, అంగల సాయిగా గుర్తించారు. వీరంతా మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు ముందు భాగం లారీ కిందకు చొచ్చుకుపోవడంతో నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రొక్లెయిన్ సాయంతో కారును బయటకు లాగారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కారు అతి వేగం కారణంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు.నిద్రమత్తులోనే ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులంతా తాండూరుకు చెందినవారు కావడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Recommended Video
వరంగల్ జిల్లాలోనూ బుధవారం(సెప్టెంబర్ 2) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద కారును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాళేశ్వరం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఇసుక లారీ, ములుగు వైపు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులను వరంగల్ పోచమ్మ మైదానంకు చెందిన మేకల ప్రవీణ్,మేకల రాకేశ్, మేడి పవన్, హన్మకొండకు చెందిన రోహిత్, నర్సంపేటకు చెందిన రహీంగా గుర్తించారు.