మాజీ నేవీ అధికారిపై దాడి... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్... శివసేన సర్కార్లో భద్రత లేదని
అటు కంగనాతో వివాదం సమసిపోకముందే మరో వివాదం శివసేనను చుట్టుముట్టింది. మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గూండాగిరి నడుస్తోందన్న విమర్శల నేపథ్యంలో బీజేపీ ఏకంగా రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తోంది. బీజేపీ బాటలోనే బాధితుడి కుటుంబ సభ్యులు కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం. దీంతో శివసేనకు మరో కొత్త తలనొప్పి మొదలైంది.
మహా సర్కార్పై నమ్మకం లేదు...
శివసేన కార్యకర్తల దాడిలో గాయపడ్డ మాజీ నేవీ అధికారి కుమారుడు సన్నీ శర్మ మాట్లాడుతూ... కేవలం అరెస్టులతో తమకు న్యాయం జరగదన్నారు. అంతేకాదు,మహారాష్ట్రలో తమకు భద్రత లేదని,అభద్రతా భావంలో ఉన్నామని వాపోయారు. మహారాష్ట్రలో గూండా రాజ్యం నడుస్తోందని... కాబట్టి రాష్ట్రపతి పాలన విధించి,రీఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహా సర్కార్ను ఇక నమ్మేది లేదని మదన్ శర్మ కుమార్తె శీలా శర్మ కూడా తేల్చి చెప్పారు.
బెయిల్పై విడుదలైన నిందితులు
దాడి కేసులో అరెస్టయిన నిందితులు శనివారం(సెప్టెంబర్ 12) రూ.5వేలు పూచీకత్తుపై బెయిల్పై విడుదలయ్యారు. దీంతో ముంబైలోని అడిషనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట మదన్ శర్మ కుటుంబ సభ్యులు బీజేపీ కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మదన్ శర్మను బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భట్కల్కర్ పరామర్శించారు. దాడి ఘటనపై ట్విట్టర్లో స్పందించిన కేంద్రమంత్రి విజయ్ కుమార్ సింగ్... '62 ఏళ్ల మాజీ నేవీ అధికారిపై గూండాల దాడి తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దేశం కోసం సేవ చేసిన ఓ వ్యక్తిపై గూండాలు దాడికి దిగడం దారుణం.' అని పేర్కొన్నారు.
ఈ సర్కార్ వద్ద.. : మదన్ శర్మ
బాధితుడు మదన్ శర్మ ఈ ఘటనపై మాట్లాడుతూ... 'ఉద్దవ్ థాక్రేకి సంబంధించిన ఓ కార్టూన్ను వాట్సాప్లో షేర్ చేసినందుకు మొదట నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత 8-10 మంది వ్యక్తులు నాపై దాడికి పాల్పడ్డారు. జీవితాంతం దేశ సేవ చేసిన నాలాంటి వ్యక్తిపై దాడికి పాల్పడ్డారంటే... ఇలాంటి ప్రభుత్వం అసలు ఉండకూడదు.' అని వ్యాఖ్యానించారు. కాగా,శివసేన వ్యక్తుల దాడిలో మదన్ శర్మ కంటికి గాయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మరోవైపు ఈ విషయంలో బీజేపీ శివసేనను గట్టిగా టార్గెట్ చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.