బెంగళూరు: కర్నాటక రాజధానిలోని ఓ హోటల్లో మహిళ పైన దాడి చేసిన ఘటనలో భారత క్రికెటర్ అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పైన విడుదలయ్యాడు.
మంగళవారం నాడు అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు గంటల పాటు విచారించారు. అనంతరం అరెస్టు చేసినట్లు బెంగళూరు డిసిపి సందీప్ పాటిల్ చెప్పారు. అయితే, ఆ తర్వాత మిశ్రా బెయిల్ పైన విడుదలయ్యాడు.
కాగా, గత నెలలో ఓ మహిళపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలతో అమిత్ మిశ్రాపై బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బెంగుళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో అమిత్ మిశ్రాపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఫైవ్ స్టార్ హోటల్లో మహిళపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలతో అమిత్ మిశ్రాపై కేసు నమోదైందని, ఆ కాపీని బీసీసీఐకు పంపించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ బౌలర్ మిశ్రాపై విచారణకు ఆదేశించింది. ఇప్పుడు విచారించిన పోలీసులు అతనిని అరెస్టు చేయడం, వెంటనే బెయిల్ పైన విడుదల కావడం జరిగింది.