పారిస్: బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే చరిత్ర సృష్టించాడు. నొవాక్ జకోవిచ్ను రెండో స్ధానానికి నెట్టి ముర్రే ప్రపంచ టెన్నిస్లో నెంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో బ్రిటన్ టెన్నిస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే ఆండీ ముర్రే పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్స్లో ముర్రే 6-3, 6-7 (4/7), 6-4తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలిచి కెరీర్లో 14వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ను దక్కించుకున్నాడు.
పారిస్ ఓపెన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో మిలోస్ రోనిక్ను ఓడిస్తే ముర్రే నంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ముందే స్పష్టమైంది. అయితే, రోనిక్ గాయం కారణంగా సెమీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ముర్రే ఫైనల్స్కు అర్హత సాధించాడు.
కాగా, ఫైనల్స్లో జరిగిన మ్యాచ్లో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలుపొందడంతో ముర్రే తన కెరీర్లోనే మొట్టమొదటిసారి ప్రపంచ నంబర్వన్ స్థానాన్ని ఆక్రమించాడు. 29 ఏళ్ల ముర్రే మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో పాటు రెండు ఒలింపిక్స్ పతకాలను సాధించాడు.
ఇదిలా ఉంటే పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ విజేతగా నిలిచిన ముర్రేకు 7,46,550 యూరోల (రూ. 5 కోట్ల 55 లక్షల 54 వేల) ప్రైజ్ మనీ లభించింది. దీంతో పాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు వచ్చాయి. దీంతో సోమవారం విడుదల కానున్న ర్యాంకింగ్స్లో ముర్రే అధికారికంగా నంబర్వన్ ర్యాంక్ని సాధించినట్లు అయింది.