కోల్కతా: టీమిండియా కోచ్గా డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ప్రపంచకప్తోనే ముగియడంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలనే అంశంపై బిసిసిఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించినా, తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. అయితే ఈ బాధ్యతలు దిగ్గజ త్రయం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలకు అప్పగించింది.
ఈ ముగ్గురు దిగ్గజాల సలహాతో బిసిసిఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా, కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కొత్తకోచ్ను ఎంపిక చేయనున్నారు. కోచ్ బాధ్యతలు గంగూలీకి అప్పజెప్తారని వార్తలు వచ్చినా, ఇప్పుడు కోచ్ ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉండడంతో దాదా ఆ పదవిని చేపట్టడం జరగదని బిసిసిఐలోని ఓ అధికారి చెప్పారు.
పలువురి పేర్లను, వారి ట్రాక్ రికార్డును, సామర్థ్యాలను పరిశీలించి, ఈ కమిటీ కోచ్ పదవికి అర్హులైన కొంత మంది పేర్లను దాల్మియాకు సూచిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఆ నివేదిక ఆధారంగా దాల్మియా, ఠాకూర్ ఒక నిర్ణయం తీసుకుంటారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. కోచ్గా ఎవరిని ఎంపిక చేస్తారో చెప్పలేమని తెలిపాడు.
ఇది ఇలా ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ విలువను కేవలం 5 లక్షల రూపాయలుగా చూ పించడంపై దుమారం రేగిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై న్యాయ ని పుణుల సలహా తీసుకోవాలని బోర్డు పాలక మండలి నిర్ణయంచింది.
చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ఇండియా సిమెంట్స్కు అధినేతగా ఉన్న శ్రీనివాసన్ ఉద్దేశపూర్వకంగా విలువను బాగా తగ్గించి చూపాడని, దీంతో బిసిసిఐకి ఆదాయానికి గండి పడిందని అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో వర్కింగ్ కమిటీ ఈ అంశాన్ని చర్చించింది.