హైదరాబాద్: టీ20 క్రికెట్లో ఏదైనా సాధ్యమే. గతంలో వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టిన సందర్భాలు అనేకం. టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే 2 బంతుల్లో 18 పరుగులు రాబట్టిన ఆటగాడిని మనం ఇంత వరకు చూడలేదు.
ఆ అరుదైన ఫీట్ని ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మన్ మనీష్ పాండే అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఐపీఎల్ 10వ సీజన్లో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత గంభీర్ సేన బ్యాటింగ్ చేసింది. ముంబై బౌలర్ మెక్లెనగన్ వేసిన ఆఖరి ఓవర్లో పాండే రెండు బంతుల్లో 18 పరుగులు రాబట్టాడు.
అదెలా సాధ్యమైందంటే.. ముంబై బౌలర్ మెక్క్లెనగన్ వేసిన తొలి బంతిని పాండే సిక్స్గా మలిచాడు. ఆ తర్వాత మెక్లెనగన్ వేసిన నో బాల్ను బౌండరీ బాదడంతో 5 పరుగులు వచ్చాయి. అంటే ఓవర్లో అప్పటికే ఒక్క బంతికి 11 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వైడ్ వేయడంతో ఒక అదనపు పరుగు లభించింది.
ఆ తర్వాతి వేసిన రెండో బంతిని పాండే మరో భారీ సిక్సర్గా మలిచాడు. దీంతో ఓవర్లో రెండు బంతులకే 18 పరుగులు వచ్చినట్లయింది. ఇలా పాండే ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకొన్నాడు. అంతటితో ఆగని పాండే అదే ఓవర్ నాలుగో బంతికి మరో ఫోర్ కొట్టాడు. ఈ మ్యాచ్లో పాండే 47 బంతుల్లో 81 పరుగులు చేసినా.. బౌలర్ల తప్పిదం వల్ల కోల్కతా ఓటమిపాలైంది.