ఆంటిగ్వా: నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడేందుకు వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా తన తొలి టెస్ట్ మ్యాచ్ను ఈరోజు ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఆడనుంది. టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్ల భాగస్వామ్యం ఎంతో కీలకం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కెప్టెన్ కోహ్లీ, రాహల్తో పోలిస్తే శిఖర్ ధావన్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓపెనర్ మురళీ విజయ్కు మరో ఓపెనర్గా కెఎల్ రాహుల్ కంటే శిఖర్ ధావన్ అయితే బాగుంటుందనే కోహ్లీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తొలి టెస్టులో భారత్ ఎలా ఆడుతుందో అన్న దానికంటే తుది జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తే సగటు క్రీడాభిమాని మదిలో మెదులుతోంది.
ఓపెనర్లుగా మురళీ విజయ్, శిఖర్ ధావన్లనే బరిలోకి దించాలనే యోచనలో కోచ్ కుంబ్లే కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఇక మూడో స్థానంలో అనుభవజ్ఞుడైన పుజారాకు అవకాశం ఇస్తారా లేక అద్భుతమైన ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్కు అవకాశం ఇస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.
కర్ణాటకకు చెందిన కెఎల్ రాహుల్ వెస్టిండిస్ పర్యటలో టీమిండియా ఆడని రెండు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో 50, 64 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. దీంతో తుది జట్టులో తన స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. జులై 20న మ్యాచ్కి ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ ఓపెనర్గా రాహుల్ను బరిలోకి దించడంపై కాస్తింత సందిగ్ధంలో పడ్డాడు.
గత మూడు, నాలుగు నెలలుగా క్రికెటర్గా కెఎల్ రాహుల్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడని చెప్పారు. దీంతో జట్టులో మూడో స్థానంలో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నాడనే సవాల్ను విసిరాడు. గతంలో శ్రీలంక సిరిస్లో కూడా రాహుల్ రాణించాడని చెప్పుకొచ్చిన కోహ్లీ, కెప్టెన్గా ఎవరెవరిని ఏయే స్ధానాల్లో ఆడించాలనేది అంత ఈజీ నిర్ణయం కాదని అన్నారు.
మరోవైపు టెస్టుల్లో శిఖర్ ధావన్ ఆట డామినేట్ చేసే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చిన కోహ్లీ, ఇందుకు ఉదాహరణగా శ్రీలంక సిరిస్లో శిఖర్ ధావన్ చేసిన సెంచరీ గురించి చెప్పారు. టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు 19 టెస్టులాడిన శిఖర్ ధావన్ 1,308 పరుగులు చేయగా అందులో 4 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.
మరోవైపు కేఎల్ రాహుల్ ఆడిన ఐదు టెస్టుల్లో 256 పరుగులు చేయగా అందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. తొలి టెస్టులో మురళీ విజయ్, కోహ్లీ, రహానే బ్యాటింగ్లో కీలకంగా వ్యవహరించనున్నారు. మరోవైపు కోహ్లీ ఎప్పటిలాగే ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతాడా లేక ఒక బౌలర్ను తగ్గించుకుంటాడా అనే దానిపై కూడా కోహ్లీ స్పష్టత ఇవ్వలేదు.
అయితే బౌలింగ్ విషయానికి వస్తే ఇషాంత్ శర్మ, అశ్విన్లకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని తెలుస్తోంది. తొలి టెస్ట్ రాత్రి 7.30 నుంచి టెన్-2, 3ల్లో ప్రసారం కానుంది.