180 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయిన ఇంగ్లాండ్
114 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్ 180 పరుగుల వద్ద తొలి వికెట్ను హసీబ్ హమీద్ రూపంలో కోల్పోయింది. 177 బంతులు ఎదుర్కొన్న అతను 82 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో 12 పరుగుల తర్వా త జో రూట్ కూడా వెనుదిరిగాడు.
రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్
నాలుగు పరుగులు చేసిన అతనిని వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టగా అమిత్ మిశ్రా పెవిలియన్కు పంపాడు. బెన్ స్టోక్స్తో కలిసి జట్టు స్కోరును 250 పరుగుల మైలురాయిని దాటించిన కెప్టెన్ కుక్ 130 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్లో రవీంద్ర జడేజా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు.
కెరీర్లో 30వ సెంచరీ చేసిన కుక్
243 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 13 ఫోర్లు ఉన్నాయి. కెరీర్లో 30వ శతకాన్ని నమోదు చేసిన కుక్ తాను అవుటైన వెంటనే రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అప్పటికి స్టోక్స్ 29 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. మిశ్రాకు రెండు వికెట్లు లభించగా, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు.
భారత్ లక్ష్యం 310 పరుగులు
ఇంగ్లాండ్ను ఓడించి, ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ల ఆధిక్యాన్ని సంపాదించేందుకు 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగా కనిపించింది. రెండో ఓవర్లోనే గౌతం గంభీర్ డకౌట్ కావడంతో, పరుగుల ఖాతాను తెరవక ముందే భారత్ ఒక వికెట్ చేజార్చుకుంది. చటేశ్వర్ పుజారా కూడా ఎక్కువ సేపు క్రీజ్లో నిలవలేక, 18 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రషీద్ బౌలింగ్లో ఎల్బిగా వెనుదిరిగాడు.
ఒత్తిడి గురైన టీమిండియా
ఓపెనర్ మురళీ విజయ్ 71 బంతుల్లో 31 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్లోనే హసీబ్ హమీద్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఒకదాని తర్వాత మరొకటిగా వికెట్లు కూలడంతో టీమిండియా ఒత్తిడికి గురైనట్టు కనిపించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజ్లో నిలదొక్కుకున్నప్పటికీ, 68 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన భారత్ మరో మూడు పరుగులకే నాలుగో వికెట్గా ఆజింక్య రహానేను చేజార్చుకుంది.
రహానే క్లీన్ బౌల్డ్
అతను కేవలం ఒక పరుగు చేసి మోయిన్ అలీ బౌలింగ్లో బంతి దిశను సరిగ్గా అర్థం చేసుకోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీతో కలిసి స్కోరును వంద పరుగుల మైలు రాయిని దాటించిన అశ్విన్ (32)ను జో రూట్ క్యాచ్ అందుకోగా జాఫర్ అన్సారీ పెవిలియన్కు పంపాడు. వృద్ధిమాన్ సాహా తొమ్మిది పరుగులు చేసి, అదిల్ రషీద్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
జాగ్రత్త పడ్డ కోహ్లీ
ఆతర్వాత రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ మరో వికెట్ చేజారకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక జడేజా (32), కోహ్లీ దాదాపు 10 ఓవర్ల పాటు ఆచితూచి ఆడుతూ వికెట్ను కాపాడుకుంటూ డ్రాతో గట్టెక్కించారు. వికెట్ల పతనం ఒకానొక దశలో అభిమానులను ఆందోళనకు గురి చేసినప్పటికీ, కోహ్లీ (49 నాటౌట్), జడేజా (32 నాటౌట్) జాగ్రత్త ఆడుతూ మ్యాచ్ని డ్రాగా ముగించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 64 పరుగులకు మూడు వికెట్లు తీసుకోగా క్రిస్ వోక్స్, జాఫర్ అన్సారీ, మోయిన్ లీ తలో వికెట్ సాధించారు.