ధోనిని క్రిస్టల్ మెమెంటోతో సత్కరించిన క్యాబ్
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు క్యాబ్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ... ధోనిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా ధోనిని క్రిస్టల్ మెమెంటోతో సత్కరించారు. ధోనిని సత్కరించే సమయంలో స్టేడియంలోని అభిమానులు ధోని-ధోని అంటూ పెద్దఎత్తున కేకలు పెట్టారు.
కపిల్ దేవ్ చేతుల మీదుగా ధోనికి జ్ఞాపిక
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేతుల మీదుగా ధోనికి జ్ఞాపికను బహుకరించారు. సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ధోని కుటుంబ సభ్యులు సైతం మూడో వన్డేకు హాజరయ్యారు. ధోని కెప్టెన్సీలోనే టీమిండియా వన్డే వరల్ట్ కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది.
మూడు ఫార్మెట్లకు కోహ్లీని కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న నేపథ్యంలో మూడు ఫార్మెట్లకు కోహ్లీని కెప్టెన్గా బీసీసీఐ ఎంపిక చేసింది. ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న కోహ్లీ ఇంగ్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరిస్ను గెలుచుకున్నాడు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా కటక్లో జరిగిన రెండో వన్డేలో యువరాజ్, మహేంద్ర సింగ్ ధోనిలు చెలరేగి ఆడారు.
కటక్ వన్డేలో సత్తా చాటిన ధోని
25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను యువరాజ్ సింగ్, ధోనిల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ నాలుగో వికెట్కు 256 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2011లో చివరిసారిగా వరల్డ్ కప్లో సెంచరీ సాధించిన యువరాజ్ మళ్లీ ఆరేళ్ల తర్వాత సెంచరీని సాధించాడు. ధోనీ కూడా 2013లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సెంచరీ చేశాడు.