బౌండరీ ఆపేందుకు కోహ్లీ డైవ్
జడేజా విసిరిన తొలి బంతిని బౌండరీగా తరలించేందుకు ఆసీస్ బ్యాట్స్మెన్ పీటర్ హ్యాండ్స్ కోంబ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడాన్ నుంచి బాల్ను వెంబండించిన కోహ్లీ బౌండరీ దాటకుండా ఆపేందుకు డైవ్ చేశాడు. ఆ ప్రయత్నంలో కుడి భుజంపై అతని బరువంతా పడింది.
కోహ్లీ భుజానికి గాయం
అనంతరం వెంటనే పైకి లేచిన కోహ్లీ తన భుజాన్ని పట్టుకుని ఇబ్బంది పడుతూ కనిపించాడు. వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియో కోహ్లీకి విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. దీంతో కోహ్లీ పెవిలియన్కు చేరాడు. తాత్కాలిక కెప్టెన్ బాధ్యతలను వైస్ కెప్టెన్ రహానే తీసుకున్నాడు.
కోహ్లీ స్ధానంలో అభినవ్ ముకుంద్
అతని స్ధానంలో అభినవ్ ముకుంద్ ఫీల్డింగ్కు వచ్చాడు. ఆ తర్వాత భుజానికి బెల్ట్తో పెవిలియన్లోనూ, డ్రెస్సింగ్ రూమ్లో షాడో ప్రాక్టిస్ చేస్తూ కనిపించాడు. ఓ పక్క మ్యాచ్ సాగుతున్నా కోహ్లీకి ఏమైందనే ఉత్కంఠ అభిమానుల్లో కొనసాగింది. రాంచీ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
తోలిరోజు ఆసీస్దే
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (117 బ్యాటింగ్; 244 బంతుల్లో 13 ఫోర్లు), మ్యాక్స్ వెల్ (82 బ్యాటింగ్; 147 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ వార్నర్ (19) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
19వ టెస్టు సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్
నిలకడగా ఆడుతూ ఆడుతూ అందివచ్చిన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ 99 పరుగుల వద్ద మురళీ విజయ్ వేసిన 82.5వ బంతిని లాంగ్ ఆన్ వైపు బౌండరీకి తరలించి 19వ టెస్టు సెంచరీ సాధించాడు. మూడో టెస్టు తొలి రోజు కెప్టెన్ స్మిత్, మాక్స్వెల్ల జోడీ ఐదో వికెట్కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్టీవ్ స్మిత్ ఈ సిరీస్లో రెండో సెంచరీ సాధించగా, సిరీస్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మాక్స్వెల్ అర్ధ సెంచరీని సాధించాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2, అశ్విన్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.