హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్ వోజెస్, జేవియర్ డోహర్తీలు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన ఆడమ్ వోజెస్ ఆస్ట్రేలియా తరుపున మూడు ఫార్మెట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగ్రేటం చేసిన ఆడమ్ వోజెస్ తన కెరీర్లో 20 టెస్టు మ్యాచ్లు ఆడి 5 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 1,485 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక కనీసం 20 ఇన్నింగ్స్ల్లో బాట్యింగ్ చేసిన వారిలో 61.87 సగటుతో సర్ డాన్ బ్రాడ్మన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.
అంతేకాకుండా 31 వన్డేలు ఆడిన వోజెస్ ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలతో 870 పరుగులు చేశాడు. ఆసీస్ తరుపున ఏడు టీ20 మ్యాచ్లాడి కేవలం ఒకే ఒక్క అర్ధసెంచరీని సాధించాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన అతి పెద్ద వయస్కుడిగా ఆడమ్ వోజెస్ గుర్తింపు సాధించాడు.
ఇక లెఫ్ట్ ఆర్మ్ సిన్నర్ అయిన జేవియర్ డోహర్తీ అంతర్జాతీయ క్రికెట్లోకి 2010లో అరంగ్రేటం చేసి 2015 వరకు ఆడాడు. ఆస్ట్రేలియా తరుపున మూడు ఫార్మెట్లలో ప్రాతినిథ్యం వహించాడు. 2015 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో కూడా ఉన్నాడు. ప్రస్తుతం కెఎఫ్సీ బిగ్ బాష్ లీగ్లో ఆడుతున్నాడు.
తన కెరీర్లో కేవలం 4 టెస్టులు ఆడి 7 వికెట్లు మాత్రమే సాధించాడు. 60 వన్డేలు ఆడి 55 వికెట్లు, 11 టీ20లు ఆడి 10 వికెట్లు సాధించాడు. డోహర్తీ తన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం నవంబర్ 2010లో శ్రీలంకపై జరిగింది. అదే ఏడాది చివర్లో ఇంగ్లాండ్పై యాషెస్ సిరిస్లో చోటు దక్కించుకున్నాడు.
ఆడమ్ వోజెస్ 10 సంవత్సరాలపాటు క్రికెట్ ఆస్ట్రేలియాకు అన్ని విధాలా కృషి చేశాడని, అతను సాధించిన ఘనతలకు అభినందనలు తెలుపుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ తెలిపాడు. జేవియర్ డోహర్తీ కూడా మంచి పోటీతత్వం ఉన్న క్రికెటర్ అని, తన శక్తి మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాకు సేవలు అందించాడని ఆయన కొనియాడాడు.