హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో పేసర్ మహ్మద్ ఆమీర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొంతకాలం ఆటకు దూరమైనా ఆమీర్ బౌలింగ్లో ఏమాత్రం పదును తగ్గలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు l | స్కోరు కార్డు
ఆదివారం ది ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది.
దీంతో భారత్పై 180 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఆమిర్ బౌలింగ్లోనే భారత కీలక బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ(0), ధావన్(21), కోహ్లీ(5)లను పెవిలియన్కు చేర్చి జట్టు విజయానికి బాటలు వేశాడు. వరుసగా కీలక వికెట్లను కోల్పోయిన భారత్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు.
ఈ సందర్భంగా పేసర్ ఆమీర్ సోదరుడు నవీద్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గతంలో ఆమీర్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి ఐదేళ్ల నిషేధానికి గురవడంతో తమ కుటుంబం అనేక అవమానాలు ఎదుర్కొందని, అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో తాజా ప్రదర్శన ఆ మచ్చను చెరిపేస్తుందని ఆశిస్తున్నామని నవీద్ అన్నాడు.
'మా కుటుంబం రావల్పిండి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేది. కానీ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత మేం అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాం. దీంతో తర్వాత లాహోర్లో స్థిరపడ్డాం' అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.
'ఇప్పుడు మళ్లీ మా గ్రామానికి వెళ్తే తలెత్తుకుని తిరగొచ్చు. నిషేధం పూర్తయినప్పటి నుంచి పాకిస్థాన్ జట్టు కోసం గొప్ప ప్రదర్శన చేయాలని ఆమీర్ తపిస్తున్నాడు. ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన మ్యాచ్లో అదే జరిగింది' అని నవీద్ తెలిపాడు.
పేద కుటుంబానికి చెందిన ఆమీర్ స్ఫాట్ ఫిక్సింగ్కు పాల్పడి ఐదేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. నిషేధం పూర్తి అయిన తర్వాత పాకిస్థాన్ జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు.