హైదరాబాద్: టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకి వేతన బకాయిల కింద రూ. కోటిని బీసీసీఐ చెల్లించింది. కోహ్లీతో విభేధాల కారణంగా ప్రధాన కోచ్ పదవి నుంచి కుంబ్లేని అవమానకర రీతిలో సాగనంపిన సంగతి తెలిసిందే.
ప్రతీ నెల రూ.25 లక్షలకు మించి చెల్లింపులను బీసీసీఐ తమ అధికారిక వెబ్సైట్లో చూపిస్తూ ఉంటుంది. మే, జూన్లకు సంబంధించి అనిల్ కుంబ్లేకి రూ.48.75 లక్షల చొప్పున ప్రొఫెషనల్ ఫీజు చెల్లించినట్టు బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇక పేసర్ ఇషాంత్ శర్మకు కూడా దాదాపు రూ. కోటి చెల్లించింది. మహిళల ప్రపంచ క్రికెట్లో రన్నరప్గా నిలిచిన అమ్మాయిలకు రూ.45 లక్షల చొప్పున విడుదల చేయడంతో పాటు మాజీ క్రికెటర్లు వివేక్ రజ్దాన్, శరణ్దీప్ సింగ్, సలీల్ అంకోలా, రితిందర్ సింగ్ సోధి, యోగ్రాజ్ సింగ్, రాబిన్ సింగ్లకు వన్టైమ్ బెనిఫిట్ కింద రూ.35 లక్షల చొప్పున అందించింది.
ఈ ఏడాది జూన్లో లండన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమి అనంతరం తన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కుంబ్లే రాజీనామాన అనంతరం ఆ పదవికి క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రిని కోచ్గా ఎంపిక చేసింది.