హైదరాబాద్: బీసీసీఐపై దేశ సర్వోన్నత న్యాయస్ధానం కొరడా ఝళిపించింది. సంస్కరణల అమలు విషయంలో లోధా కమిటీ, బీసీసీఐ మధ్య నడుస్తున్న కేసు వివాదంపై ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీం.. సోమవారం ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది. బీసీసీఐ అధ్యక్షుడి పదవి నుంచి అనురాగ్ ఠాకూర్ని తొలగించింది.
అనురాగ్తో పాటు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేపైనా సుప్రీం కోర్టు వేటు వేసింది. లోధా కమిటీ సంస్కరణల అమలు విషయంలో బీసీసీఐ సహకరించడంలేదని, లోధా సిఫారుసులను అడ్డుకునేందుకు అనురాగ్ ఠాకూర్ ఐసీసీని ఆశ్రయించారంటూ లోధా కమిటీ సుప్రీం కోర్టుకు మధ్యంతర నివేదికను అందించింది.
అంతేకాదు బీసీసీఐలో 'కాగ్' అధికారి నియామకం ప్రభుత్వ జోక్యం కిందికి వస్తుందని తెలుపుతూ లేఖ రాయాలని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ను ఠాకూర్ కోరినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అయితే అనురాగ్ దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. దాంతో డిసెంబర్ 16వ తేదీన విచారణలో అనురాగ్పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
లోధా కమిటీ సిఫారుసులను అమలు చేయాల్సేందేనంటూ సుప్రీం కోర్టు చెప్పినా, వాటిని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మాత్రం సీరియస్గా తీసుకోలేదు. ప్రధానంగా కూలింగ్ ఆఫ్ పిరియడ్, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అనే లోధా సిఫారసులను వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతేకాదు లోధా కమిటీ పేర్కొన్న కొన్ని సిఫారుసులను అమలు చేయడం కష్టసాధ్యమని అన్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం బీసీసీఐకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవటంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో బోర్డులోని కీలక పదవులను కోల్పోనున్నారు. మరోవైపు అసత్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు చర్యలు తీసుకుంటామని.. జైలుకు వెళ్లాల్సి వస్తుందని గత విచారణ సందర్భంగా కోర్టు అనురాగ్ ఠాకూర్ను హెచ్చరించింది.
కాగా, తొలగించిన వారి స్ధానంలో త్వరలోనే కొత్తవారితో పదవులను భర్తీ చేయనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. దీనిలో భాగంగా టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును ఈరోజు విచారించిన తరువాత బోర్డు అధ్యక్షుడు అనురాగ్, కార్యదర్శి షిర్కేలపై వేటు వేసింది. లోధా కమిటీ సిఫారుసులు అమలు చేయనందుకు ఆ ఇద్దర్ని బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.