హైదరాబాద్: క్రికెట్ ఆస్ట్రేలియాతో వేతనాల వివాదం కారణంగా గత రెండు నెలలుగా క్రికెట్కి దూరంగా ఉన్న ఆ దేశ క్రికెటర్లు తాజాగా బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్కి సిద్ధమయ్యారు. ఆగస్టు 22 నుంచి బంగ్లా పర్యటన ప్రారంభం కానుంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుండటంతో ఈ సిరిస్పై అమితాసక్తి నెలకొంది.
ఈ రెండు నెలల విశ్రాంతి ఆస్ట్రేలియా క్రికెటర్లకి కలిసొస్తుందని, వేతనాల గొడవ మరిచిపోయి క్రికెటర్లు సత్తాచాటుతారని ఆ జట్టు కోచ్ డారెన్ లీమన్ తెలిపారు. బంగ్లా పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
'విశ్రాంతి కొన్ని సమయాల్లో మంచే చేస్తుంది. మా క్రికెటర్లు గత కొంతకాలంగా ఎడతెరపిలేని క్రికెట్ ఆడుతున్నారు. వారి మైండ్ రీప్రెష్ అవడానికి మంచి అవకాశం చిక్కింది' అని అన్నారు.
వేతనాల గొడవ అనంతరం బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్కి ఆసీస్ క్రికెటర్లు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారని లీమన్ వెల్లడించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ), ఆసీస్ క్రికెటర్ల మధ్య నెలకొన్న జీతాల వివాదం ఇటీవలే ఒ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి క్రికెట్ ఆస్ట్రేలియా ఆదాయంలో వాటా ఇచ్చేందుకు అంగీకరించింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఆసీస్ క్రికెటర్లు ఐదేళ్ల కాలానికి సుమారు 396 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సీఏ అంగీకరించింది. ఈ మొత్తం క్రికెట్ ఆస్ట్రేలియా ఆదాయంలో 30 శాతం కావడం విశేషం. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకి వచ్చే ఆదాయంలో పావు వంతు క్రికెటర్లకి జీతాల రూపంలో ఇచ్చే ఒప్పందాన్ని ఇటీవల మార్చాలని ప్రయత్నించడంతో ఆటగాళ్లు ఎదురుతిరిగారు.
దాదాపు నెలన్నరపాటు ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా బోర్డపై నిరసన తెలిపారు. చివరికి బోర్డు దిగొచ్చి గతంలో మాదిరి కాంట్రాక్ట్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.