హైదరాబాద్: విరాట్ కోహ్లీ నేతృత్వంలో ప్రస్తుతం ఉన్న టీమిండియా 2019లో వరల్డ్ కప్ గెలుస్తుందని అక్షర పటేల్ అభిప్రాయపడ్డాడు. ఆరు నెలల అనంతరం జట్టులోకి వచ్చిన అక్షర పటేల్ ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
తొలి వన్డేలో అక్షర పటేల్ 3 వికెట్లు తీసి 34 పరుగులివ్వడంతో పాటు ఆతిథ్య శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాడు జస్ప్రీత్ బుమ్రాతో అక్షర పటేల్ సరదాగా ముచ్చటించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది.
'చాలా రోజుల తర్వాత జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. జట్టులో అవకాశం లభించలేదని ఎప్పుడు దిగులు చెందలేదు. లంక ఓపెనర్లు ధాటిగా ఆడుతున్న సమయంలో బౌలింగ్ వేసే అవకాశం వచ్చింది. నేను కుదురుకోవడానికి రెండు ఓవర్లు వేయాల్సి వచ్చింది. అనంతరం ఖచ్చితంగా వికెట్ తీయాలనుకున్నా అలాగే నాకు తొలి వికెట్ దక్కింది' అని గేమ్ ప్లానింగ్ గురించి బుమ్రా అడిగిన ప్రశ్నకు అక్షర్ పటేల్ సమాధానమిచ్చాడు.
ఒకరిపై ఆధారపడకుండా సమిష్టి ప్రదర్శనతో ఈ విజయం సాధించామని అక్షర్ పటేల్ చెప్పాడు. జట్టులో ఆటగాళ్లందరూ 25 నుంచి 27 మధ్య వయస్సు వారే ఉన్నారని, అంతే కాకుండా జట్టు ఐక్యంగా ముందుకు వెళ్తూ విజయాలు సాధిస్తుందని, 2019 వరల్డ్కప్ ఈ యువ జట్టుదేనని అక్షర్ పటేల్ జోస్యం చెప్పాడు.
MUST WATCH - @Jaspritbumrah93 bowls few verbal Yorkers at @akshar2026 and the all-rounder does well - by @RajalArora https://t.co/h9hmZ4sbdO pic.twitter.com/Fxyk18QAuD
— BCCI (@BCCI) 21 August 2017
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా శ్రీలంకతో భారత్ రెండో వన్డే ఆగస్టు 24 (గురువారం) పల్లెకలెలో ఆడనుంది. ఈ సిరిస్లో టీమిండియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది.