హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. మూడు టెస్టుల్లో భాగంగా చివరిదైన మూడో టెస్టు ఆగస్టు 12 (శనివారం) ప్రారంభం కానుంది. కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై భారత్ ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తద్వారా 2-0తో సిరిస్ను కైవసం చేసుకుంది. రెండో టెస్టులో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో మూడో టెస్టులో జడేజా స్థానంలో అక్షర్ పటేల్కు చోటు కల్పించినట్లు సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
రెండో టెస్టులో శ్రీలంక బ్యాట్స్మెన్ పుష్పకుమారవైపు జడేజా ప్రమాదకరంగా బంతిని విసరడాన్ని అంపైర్లు తీవ్రంగా పరిగణించారు. దీంతో ఐసీసీ జడేజాపై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించింది. దీంతో అతని స్థానంలో అక్షర్ పటేల్ను సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది.
దీంతో చివరి టెస్టు కోసం ఎంపిక చేసిన 15మంది జట్టు సభ్యుల్లో అక్షర పటేల్ చోటు దక్కించుకున్నాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ ఇప్పటికే భారత జట్టుతో ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి తుది జట్టులో స్థానం దక్కనుంది. 11మందితో కూడిన తుది జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.
23 ఏళ్ల అక్షర్ పటేల్ ఇప్పటివరకు భారత్ తరుపున 30 వన్డేలు, 7 టీ20లు ఆడినప్పటికీ టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ముక్కోణపు సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్లాడిన అక్షర్ పటేల్ 7 వికెట్లు తీశాడు.